వివాహం: కార్డ్‌ బోర్డు కట్‌ అవుట్‌లే అతిథులు‌ | Wedding In Corona Times Cardboard Cutouts As Guests In London | Sakshi
Sakshi News home page

వివాహం: కార్డ్‌ బోర్డు కట్‌ అవుట్‌లే అతిథులు‌

Sep 14 2020 7:17 AM | Updated on Sep 14 2020 7:23 AM

Wedding In Corona Times Cardboard Cutouts As Guests In London - Sakshi

రోమీ, స్మిత్‌

పెళ్లి కళ అంటారు కానీ, ఆ కళ వధూవరులకు వాళ్లకై వాళ్లకు వచ్చేది కాదు. వస్తూ వస్తూ.. పెళ్లికి వచ్చేవాళ్లు తెచ్చేది. కరోనా వల్ల ఇప్పుడు వాళ్లు రాక, రాలేక లోకానికే పెళ్లి కళ తప్పింది. అటిద్దరు, ఇటిద్దరు! చేసుకుని ఏం లాభం అని అమ్మాయి అబ్బాయి నిరుత్సాహంగానే పీటల పై కూర్చుంటున్నారు. ఏదో.. చేసుకుంటున్నామంతే అన్నట్లు నీరసంగా దండలు మార్చుకుంటున్నారు. ఇప్పుడంటే సరే.. పదేళ్లకో, పాతికేళ్లకో పెళ్లి ఫోటోలు చూసుకోవాలనిపించదా.. అప్పుడూ నీరసమే కదా.. పెళ్లి వేడుకలో ఆకాశమంత పందిరి కనిపించి, ఆ పందిరి కింద పెళ్లికి రాని వారు కనిపించకపోతే! అందుకే ఇంగ్లండ్‌ లో ఓ పెళ్లిజంట 2 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి (రెండు వేల పౌండ్‌ లకు పైగా) 48 మంది గెస్టుల్ని పెళ్లికి ’తెప్పించుకుంది’.

అక్కడ ప్రస్తుతం అమల్లో ఉన్న కరోనా నిబంధనల ప్రకారం పెళ్లిలో 30 మందికి మించి కనిపించడానికి లేదు. మరి వీళ్లు అంతమందిని ఎలా తెప్పించుకున్నారు? కార్డ్‌ బోర్డులతో వాళ్ల  కట్‌ అవుట్‌ లు చేయించుకుని, పెళ్లికి ట్రాన్స్‌ పోర్ట్‌ చేయించుకున్నారు. వాటి పక్కన నిలబడి ఫొటోలు తీయించుకున్నారు. పెళ్లికూతురి పేరు రోమీ. ఆమెదేనట ఈ ఐడియా. ’వావ్‌’ అంటూ ఆమెను ఆరాధనగా చూడ్డానికే సరిపోయిందట పెళ్లి కొడుకు స్మిత్‌ కి.. పెళ్లి రోజంతా.

Advertisement
 
Advertisement
Advertisement