మింట్ కాంపౌండ్లో సేదదీరుతున్న నగరవాసులు
సాక్షి, హైదరాబాద్: ఒక వైపు సచివాలయం.. మరో వైపు నాణేలు ముద్రించే మింట్ కాంపౌండ్.. అనేక ప్రాంతాలను కలిపే కూడలి.. అక్కడ ఓ మర్రి చెట్టు.. దాని నీడలో 30 ఏళ్లుగా ఓ కుటుంబం పుచ్చకాయల ముక్కలు విక్రయిస్తోంది. సాధారణంగా మండుటెండల్లో మాత్రమే పుచ్చకాయల విక్రయాలు కనిపిస్తాయి. కానీ ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ మర్రి చెట్టు నీడలో మాత్రం 365 రోజులు విక్రయిస్తుంటారు.
షేక్ మౌలానా 30 ఏళ్ల క్రితం మింట్ కాంపౌండ్లోని అతి పెద్ద మర్రి చెట్టు కింద పుచ్చకాయలు కోసి అమ్మడం ప్రారంభించాడు. అయితే ప్రస్తుతం మౌలానా భాయ్ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన కొడుకులు పర్వేజ్, ముబీన్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతం చుట్టూ పర్యాటక ప్రదేశాలు ఉండటంతో నగరానికి వచ్చే వేలాది మందికి మర్రి చెట్టు (Banyan Tree) సుపరిచితమే.
ఐస్ వాడకుండా..
సాధారణంగా బయట దుకాణాల్లో పుచ్చకాయ ముక్కలు విక్రయించే వారు ముక్కలు చల్లగా ఉండేందుకు ఐస్ వినియోగిస్తారు. కానీ వీరు మాత్రం అప్పటికప్పుడు ముక్కలు కోసి వినియోగదారులకు అమ్మతుంటారు. మధ్యాహ్నం నుంచే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఎంతో మంది కుటుంబ సభ్యులతో సహా వచ్చి పుచ్చకాయ ముక్కలు కొనుగోలు చేస్తుంటారని నిర్వాహకులు చెబుతున్నారు.

రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు..
సీజన్తో పనిలేకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ప్రత్యేక లారీల్లో వీటిని తెప్పించి ఇక్కడ విక్రయిస్తుంటారు. సచివాలయానికి వచ్చే రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు సైతం మర్రి చెట్టు నీడన సేదదీరతారు. మొదట్లో ప్లేట్ 10 పైసలకు అమ్మేవాడని, ప్రస్తుతం రూ.30కి విక్రయిస్తున్నట్లు తెలిపారు.
చదవండి: ఈ హైదరాబాద్ అన్నాచెల్లెలు.. ఏకధాటిగా 700 స్లోకాలు


