‘పిల్లలు పుట్టుకతోనే ఆర్టిస్ట్లు’ అంటారు పికాసో. ఈ అన్నా చెల్లెళ్లను చూస్తే నిజమేననిపిస్తుంది. హైదరాబాద్లోని బీహెచ్ఇఎల్లో ఉంటున్న ఎ.ఆర్.అనంత్ భరద్వాజ్ ప్రవీణ్, మహతి శ్రీమణి ప్రవీణ్లు ఆరు, నాలుగు తరగతులు చదువుతున్నారు. అన్న ‘మై చిర్పింగ్ థాట్స్’ అని కథల పుస్తకం రాస్తే, చెల్లెలు ‘ది ఫ్లోయింగ్ పెన్’ పేరుతో కవితా సంపుటం తీసుకువచ్చింది...
చిన్ననాటి ‘అన్నాచెల్లెలు’ అనగానే మనకు టామ్ అండ్ జెర్రీ కార్టూన్ షోలోని క్యారెక్టర్లు గుర్తుకువస్తాయి. పదకొండేళ్ల ఎ.ఆర్.అనంత్ భరద్వాజ్ ప్రవీణ్, తొమ్మిదేళ్ల మహతి శ్రీమణి ప్రవీణ్లు కూడా ఈ పాత్రలకు ఏ మాత్రం తీసిపోరు అన్నట్లుగా పోటీ పడేవాళ్లు. తెగ అల్లరి చేసేవారు.
ఫస్ట్ క్లాస్లో స్టోరీ..
అనంత్, మహతీల ప్రతిభ, అల్లరి గురించి తల్లిదండ్రులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కస్తూరి ప్రవీణ్కుమార్కు చెప్పారు. ‘అన్నింటిలోనూ ఒకరికన్నా ఒకరు ముందు ఉండాలని పోటీపడుతుంటారు. ఈ విషయంలో ముందుగా మహతి ఉంటుంది’ అని కూతురు గురించి వివరించారు శకుంతల. మహతి ఫోర్త్ క్లాస్ చదువుతోంది. అన్నయ్య కథలు రాస్తుండటం చూసి తనూ ఫస్ట్ క్లాస్లో ఒక కథ రాసింది. ఆ తర్వాత తన ఆలోచనను కవిత్వం మీదకు మళ్లించింది. తను రాసిన కవితలన్నింటినీ కలిపి తల్లిదండ్రులు ఇ–బుక్గా తీసుకువచ్చారు.
ఇందులో కవితల గురించి ప్రస్తావిస్తూ ‘ఫ్లైయింగ్ హై’ అనే కవిత తనకు ఎందుకు బాగా నచ్చుతుందో తెలిపింది మహతి. ‘ఈ కవితలో ఈగల్ – ఫాల్కన్స్ అనే రెండు గ్రూప్ ఆఫ్ బర్డ్స్ పోటీ పెట్టుకుంటాయి. ఆ పోటీలో ఒక చిన్న ఫాల్కన్ బర్డ్ కూడా పాల్గొంటుంది. కానీ, అది పెద్ద బర్డ్స్తో పోటీపడలేకపోతుంది. ఆ బర్డ్స్ అన్నీ కలిసి కోచ్ దగ్గర ట్రైన్ అవుతుంటాయి.
చిన్న ఫాల్కన్ బర్డ్కి ట్రైనింగ్ అంటే కష్టంగా ఉండి, ఒక పొద దగ్గర కూర్చొని ఏడుస్తుంటుంది. అప్పుడు మదర్ ఫాల్కన్ వచ్చి ఏదైనా కష్టపడితేనే వస్తుంది, ఏడుస్తూ కూర్చుంటే రాదు అని చెప్పిన మాటలను గుర్తుకుపెట్టుకొని, కష్టపడి ట్రైనింగ్ తీసుకొని, చిన్న ఫాల్కన్ పోటీలో పాల్గొంటుంది. ముందు ఆ చిన్న బర్డ్ ఈగల్స్ని, బ్రదర్ ఫాల్కన్ని, మదర్ ఫాల్కన్ని క్రాస్ చేసి. చివరికి అతి కష్టమ్మీద ఫాదర్ ఫాల్కన్ని కూడా క్రాస్ చేసి గెలుస్తుంది. అందరితో పోటీ పడటానికి, నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి కవిత్వం ఉపయోగపడింది. అందుకు బర్డ్స్ని ఉదాహరణగా తీసుకున్నాను’ అని చెప్పింది మహతి. సైన్యంలో పనిచేసే శునకాల గురించి కూడా రాసింది మహతి.
‘సైన్యంలో పనిచేసే వారికి అవార్డులు ఇస్తారు. కానీ, అక్కడ పనిచేసిన చేసిన డాగ్స్కి మాత్రం ఏమీ ఇవ్వరు..’ ఈ ఆలోచనతో శునకాలకు కూడా అవార్డులు ఇవ్వాలని కవిత రాసింది. పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అనే అంశంపై రాసిన ‘డైట్’ కవిత జాతీయ దిన పత్రికలో ప్రచురణ అయింది.
సిరీస్ స్టోరీస్...
ఎ.ఆర్.అనంత్ భరద్వాజ్ ప్రవీణ్ మూడేళ్లుగా కథలు రాస్తున్నాడు. ఇంటి దగ్గర, పార్క్ ఏరియాలో కనిపించే పాముల నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలి అనే అంశంపై స్వీయ అనుభవాలను కథల రూపంలో తీసుకువచ్చాడు.
‘మా పాప ఒకసారి క్లాస్లో బి+ గ్రేడ్ వచ్చింది. దాంతో బాగా ఫీలయిపోయి రాసిన పోయెమ్ ఫ్లైయింగ్ హై. బాబు గురించి చెప్పాలంటే స్కూల్కి లంచ్ బాక్స్ పెట్టిస్తే సరిగా తినేవాడు కాదు. ఇంట్లోనూ అంతే. మేం పదే పదే తినమని చెబుతుండేవాళ్లం. దీంతో రోబో స్పూన్ తినిపించడం గురించి ఒక కథ. పాము ఇంటికి వస్తే ఏం చేయాలి? డ్రోన్ ద్వారా వాటిని ఎలా కనిపెట్టవచ్చు అని మరో కథ రాశాడు. హోమ్ వర్క్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. దీంతో రోబో పెన్ పేరుతో ఒక క్రియేటివ్ పెన్ గురించి, అది బ్లైండ్ పీపుల్కి ఉపయోగించినట్లు ఒక సొల్యూషన్లా చూపెట్టాడు. ఇలా ఏదైనా సమస్యగా అనిపిస్తే దానిని కథగా తీసుకొని, పరిష్కారం కూడా కనిపెట్టి నోట్ చేస్తాడు. ప్రతి స్టోరీలోనూ ఇంత ఆలోచిస్తాడా అనిపించింది’ అని వివరించారు శకుంతల.
చదవండి: నిజమైన వ్యక్తిత్వ వికాసం మొదలయ్యేది అప్పుడే..!
‘నాకు వచ్చిన చిన్న చిన్న ఆలోచలను కథల రూపంలో పెట్టాను. నా వయసు ఉన్న అబ్బాయి ఎదుర్కొనే సమస్యలు, పరిష్కారం గురించి ఈ కథలు ఉంటాయి’ అంటున్నాడు భరద్వాజ్. ఈ పుస్తకాలను ప్రింట్లో తీసుకురావడానికి చాలా ఖర్చు అవుతుందని, ఇద్దరి బుక్స్ని డిజిటల్గా తీసుకువచ్చారు.
ఏడువందల శ్లోకాలు ఏకధాటిగా
బీహెచ్ఇఎల్ భారతీయ విద్యాభవన్స్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న ఈ అన్నాచెల్లెళ్లు కథలు, కవిత్వాలు రాయడంలోనే కాదు భగవద్గీత శ్లోకాలను కంఠతా చేయడంలోనూ సాటిలేరని నిరూపిస్తున్నారు. కర్ణాటకలోని శృంగేరి శారదా మఠం వాళ్లు మార్చిలో నిర్వహిస్తున్న భగవద్గీత శ్లోకాల కాంపిటీషన్లో వీరిద్దరూ పాల్గొంటున్నారు. అన్నయ్య నేర్చుకుంటున్నాడని చెల్లెలు మహతి భగవద్గీత కాంపిటీషన్లో పాల్గొనడానికి 700 శ్లోకాలు నేర్చుకుంది. ఏడాది పాటు చేసిన ఈ ప్రయత్నం వీరిని పోటీలో పాల్గొనేలా చేసింది. ఇద్దరికీ మొదట తెలుగు వచ్చేది కాదు. కానీ, భగవద్గీత శ్లోకాల ద్వారా తెలుగు కూడా సులువుగా నేర్చేసుకున్నారు. నేటి పిల్లలు టీవీలు, మొబైల్ స్క్రీన్కే పరిమితం అవుతున్నారని పెదవి విరిచేవారికి రచనలతో, శ్లోకాలతో సమాధానం చూపుతున్నారు ఈ అన్నాచెల్లెళ్లు.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి


