మాధవ దేశాన్ని విక్రమ సింహుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన గొప్ప దాత. ఒకనాడు దూర్రపాంతాల నుంచి ఒక మహర్షి విక్రమ సింహుడి వద్దకు వచ్చాడు. రాజు ఆయనకు సేవలు చేసి సత్కరించాడు. సంతోషించిన మహర్షి రాజుతో ‘రాజా! నీ దాన గుణం ఎన్నదగ్గది. అయితే అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. నువ్వు ఎన్ని దానాలు చేసినా చాలు అని అనరు. అయితే అన్నం పెడితే మాత్రం ఇక చాలు అంటారు. ఆ దానాన్ని ్రపారంభించు’ అన్నాడు.
దానికి విక్రమసింహుడు అంగీకరించాడు. వెంటనే భారీ స్థాయిలో నిత్యాన్నదానానికి ఏర్పాట్లు చేశాడు. ఆ ఏర్పాట్లు చూసిన మహర్షి రాజుతో ‘రాజా! నీ దానగుణం గొప్పదని చెప్పానుగా! అయితే అది లోకమంతా తెలియాలంటే అన్నాన్ని పాత్రల మీద కాకుండా ఇసుకతో చేసిన కుండలలో వండించు’ అన్నాడు. దానికి విక్రమసింహుడు ఆశ్చర్య΄ోయాడు. ఇసుకతో చేసిన కుండలు నిలుస్తాయా? వాటిలో అన్నం వండటం సాధ్యమేనా అని భావించాడు. అయితే మహర్షి మాటలు వమ్ము చేయలేక ఇసుకతో కుండలు చేయించి అందులో అన్నం వండించాడు. కుండలు విడి΄ోకుండా అన్నం తయారైంది. విక్రమసింహుడు సంతోషించాడు. ఆ అన్నాన్ని అందరికీ వడ్డించారు.
మహర్షి రాజు వద్ద సెలవు తీసుకుంటూ ‘రాజా! ఒక్క విషయం గుర్తుంచుకో. రోజూ ఇలా ఇసుకతో చేసిన కుండల్లో అన్నం వండి అన్నదానం చేయించు. అయితే ఎప్పుడైతే నీలో గర్వం ప్రవేశిస్తుందో అప్పుడు నీకు అన్నదాన ఫలితం దక్కదు’ అని హెచ్చరించాడు. విక్రమసింహుడు సరే అన్నాడు. ఇసుకతో చేసిన కుండల్లో అన్నం వండి విక్రమసింహుడు చేస్తున్న అన్నదానం దశదిశలా కీర్తి తెచ్చింది. జనం తండోపతండాలుగా అతని రాజ్యానికి వచ్చి దానాలు స్వీకరించేవారు. ఈ క్రమంలో మహర్షి చెప్పిన మాటలు విక్రమసింహుడు మర్చిపోయాడు. మెల్లగా అతనిలో గర్వం మొదలైంది.
తన ఘనత వల్లే ఇలా జరుగుతోందని భావించాడు. ఆ తర్వాతి రోజు ఇసుకతో కుండలు చేసి అన్నం వండబోగా కుండ విడి΄ోయి అన్నం నేలపాలైంది. ఆ పూట అందరూ పస్తులు ఉండాల్సి వచ్చింది. వెంటనే రాజుకు మహర్షి చేసిన హెచ్చరిక గుర్తుకొచ్చింది. తన దానగుణాన్ని చూసుకొని తాను గర్వపడటం వల్లే ఇలా జరిగిందని భావించాడు. పేదలకు అన్నం అందించడంలో తానొక సేవకుడు మాత్రమేనని ప్రజల సంపద నుంచి ప్రజలకు మేలు చేయడంలో తన ఘతన ఏమీ లేదని తెలుసుకుని గర్వం మానుకున్నాడు. ఆ తర్వాత అన్నదానం కొనసాగింది. జనం జేజేలు పలికారు.


