సాక్షి, మన్యం: పార్వతీపురం మన్యం జిల్లా జయ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పాపం.. ఏం కష్టం వచ్చిందో ఏమో నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వారిలో ముగ్గురు మృతి చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
పోలీసుల సమాచారం ప్రకారం.. మీనక మధు (35), ఆయన భార్య సత్యవతి (30), వారి కుమార్తె ఆయోష (6), నాలుగు నెలల పసికందు మోషలు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు వారిలో ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిన్నారుల అమాయక ముఖాలు, తల్లిదండ్రుల నిర్జీవ దేహాలు ఒకే ఇంట్లో కనిపించడంతో స్థానికులు కన్నీటి పర్యంతరమవుతున్నారు.
ఈ ఘటనకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే, కుటుంబం ఆత్మహత్యాయత్నానికి ఆర్థిక ఇబ్బందులేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో వనజ గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.


