తండ్రీకొడుకుల భావోద్వేగమే ‘వారణాసి’ సినిమా కథకు మూలం అని రాజమౌళి చెప్పారు. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ మైథలాజికల్ అడ్వెంచరస్ ఫాంటసీ యాక్షన్ డ్రామాలో రాముడిగా, శివభక్తుడు రుద్రగా మహేశ్బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అయితే ఈ సినిమా చిత్రీకరణకు ప్రస్తుతం చిన్న బ్రేక్ పడింది. దీంతో వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లారు మహేశ్బాబు.
అయితే రాజమౌళి మాత్రం యూరప్లో పర్యటిస్తూ ‘వారణాసి’ సినిమాని ఇప్పట్నుంచే అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్యారిస్లో ఉన్నారు రాజమౌళి. అక్కడి ప్రముఖ థియేటర్స్లో ‘ఆర్ఆర్ఆర్’, ‘ఈగ’, ‘బాహుబలి’ వంటి సినిమాల ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగానే ‘వారణాసి’ గురించి ఓ కీలక అప్డేట్ను ఇచ్చారు రాజమౌళి. ‘‘తండ్రీకొడుకుల భావోద్వేగమే ‘వారణాసి’ సినిమా కథకు ప్రధాన మూలం.
ఈ ఎమోషన్ నుంచే ‘వారణాసి’ వరల్డ్ ప్రారంభం అవుతుంది. ఆఫ్రికాలోని అటవీ ప్రాంతాలు, అంటార్కిటికా విజువల్స్, రామాయణంలోని దేవుళ్లు, జాతీయ విపత్తులు, ఫాంటసీ.. ఇలా అన్నీ అంశాలను మా మూవీలో ప్రేక్షకులు ఎక్స్పీరియన్ ్స చేస్తారు’’ అని పేర్కొన్నారు. కాగా ఈ చిత్రంలో ప్రకాష్రాజ్, మహేశ్బాబు తండ్రీకొడుకులుగా కనిపిస్తారని ఫిల్మ్నగర్ టాక్. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ‘వారణాసి’ చిత్రం 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.
ఊహించని సర్ప్రైజ్...
‘‘నా చిత్రాలు ప్యారిస్లో ప్రదర్శించబడటం నాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. అయితే నేను ఊహించని సర్ప్రైజ్ ఒకటి నన్ను వెతుక్కుంటూ వచ్చింది.
ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేక పోతున్నాను. గొప్ప వ్యక్తి హెన్రీ లాంగ్లోయిస్ పేరుతో స్థాపించబడి, ప్రపంచంలోనే ప్రఖ్యాత చలన చిత్ర సంస్థల్లో ఒకటిగా నిలిచిన హాల్స్లో నాకు శాశ్వత స్థానం లభించడం లైఫ్లో మర్చిపోలేను. ఈ గౌరవాన్ని నాకు అందించినందుకు, భారతీయ సినిమాను ఇంతటి అప్యాయతతో, ప్రేమతో ఆదరించినందుకు కోస్టా గావ్రాస్కు, సినీమాథెక్ ఫ్రాంసేజ్ కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు రాజమౌళి.


