
ఈ మధ్య సర్వ సాధారణంగా మారిన రొమ్ము కేన్సర్ను ‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ అంటూ ఫ్యూజీఫిల్మ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక ప్రచార కార్యక్రమాన్ని అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ విభాగం వైస్ చైర్పర్సన్ ఉపాసన కొణిదెల ప్రారంభించారు.
అపోలో ఫౌండేషన్ అమలు చేస్తున్న ఈ ప్రచారాన్ని హైదరాబాద్ నగరంలోని ఐటీసీ కోహినూర్ వేదికగా బుధవారం దీనిని ప్రారంభించారు. ఉపాసన మాట్లాడుతూ.. వైద్యరంగంలో అత్యుత్తమ సేవలను అందించడమే కాకుండా.. బ్రెస్ట్ కేన్సర్ వంటి రోగాలను ముందుగా గుర్తించాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
సరైన అవగాహన, తగిన సమాచారం, సత్వరగా చికిత్సకు వనరులు లేకపోవడంతో చాలామంది మహిళలు మరణిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలకు చేరువ చేయడానికి ఫ్యూజీఫిల్మ్ ఇండియా చేపట్టిన ఈ సీఎస్ఆర్ ప్రచారం ఉపయోగపడుతుంది. ఐసీఎంఆర్ వారి జాతీయ కేన్సర్ రిజిస్ట్రీ అంచనాల ప్రకారం, మహిళలకు వచ్చే మొత్తం రోగాల్లో 14 శాతం ఇదే ఉంటోంది.
ప్రతి 29 మంది మహిళల్లో ఒకరికి జీవితకాలంలో రొమ్ము కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆమె పేర్కొన్నారు. అనంతరం ఫ్యూజీఫిల్మ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కోజి వాడా ఈ ప్రచార వివరాలు వెల్లడించారు. దేశంలోని 24 నగరాల్లో, శిక్షణ పొందిన సిబ్బంది ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ఈ ప్రచారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో పలువురు వైద్య నిపుణులు, సామాజిక సేవా రంగ ప్రముఖులు పాల్గొన్నారు.
(చదవండి: డెట్రాయిట్లో 'తెలుగు పల్లెవంట')