ఈ వారం కథ: అభిమాని! | A Story By An Admirer Srinivasa Rao Tirukkovulluru Funday Story | Sakshi
Sakshi News home page

ఈ వారం కథ: అభిమాని!

Jun 14 2026 10:08 AM | Updated on Jun 14 2026 10:08 AM

A Story By An Admirer Srinivasa Rao Tirukkovulluru Funday Story

ఫండే..

నేను ప్రయాణిస్తోన్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏదో స్టేషన్‌ రావడంతో చదువుతున్న పుస్తకాన్ని పక్కనపెట్టి కిటికీలోంచి బైటకు చూశాను. వరంగల్‌ స్టేషను వచ్చింది. మరో రెండున్నర గంటల్లో హైదరాబాద్‌ చేరుకుంటానని అనుకుంటుండగా నా సెల్‌ఫోన్‌ మోగింది. నేను ఊహించినట్టే ఆ ఫోన్‌ రామబ్రహ్మంగారి నుంచే. ఆయన పేరు స్క్రీన్‌ మీద కన్పించగానే నా మనసులో ఏదో తెలియని అసహనం, కాస్త చిరాకు చోటుచేసుకున్నాయి.
షరా మామూలే... ఏ విషయంలేని ఊకదంపుడు ప్రశ్నలే! ఎలాగో ఓపిక చేసుకుని కాసేపు అడిగిన వాటన్నింటికి బదులిచ్చి ఫోన్‌ పెట్టేశాను.

రామబ్రహ్మంగారు నా మనోఫలకంపై మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. నా ఈ ప్రయాణంలో అనేక దఫాలు ఆయన గుర్తుకు వస్తూనే వున్నారు.
నేను విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ బయల్దేరింది కేవలం రామబ్రహ్మంగారిని కలవడం కోసమేనని ఆయన అనుకుంటున్నారు. రామబ్రహ్మంగారు అలా అనుకోవాలనే నేనూ బలంగానే నమ్మించగలిగాను.

వాస్తవానికి హైద్రాబాద్‌లో నాకు తెలిసిన ఓ సాహితీమిత్రుని సన్మాన కార్యక్రమానికి తప్పక హాజరు కావాల్సివుంది. ఎందుకంటే అతను ఒకసారి నా సన్మాన కార్యక్రమానికి హైద్రాబాద్‌ నుంచి ఎంతో ఖర్చుపెట్టుకుని ఫ్లైటులో వచ్చాడు.
పనిలో పనిగా ఒకేసారి రెండు పనులూ అయిపోతాయని రామబ్రహ్మంగారిని కలవడానికి అంగీకరించాను.
రామబ్రహ్మం గారితో నా అనుబంధం పదేళ్లనాటిది. ఆయన హైదరాబాదులో ఉంటున్నారు. ఈ పదేళ్లుగా నన్ను హైదరాబాద్‌లోని తనింటికి రమ్మనమని అనేక దఫాలుగా పోరుపెడుతూనే వున్నారు. నాకే ఇష్టంలేక ఎప్పటికప్పుడు ఏదో నెపం చెప్తూ తప్పించుకుంటూ వచ్చాను.

ఈరోజు ఆయనకు నా పట్లగల అపారమైన అభిమానమే నన్ను బయలుదేరేలా చేసిందని చెప్తే, అది ఆత్మవంచనే అవుతుంది. నిక్కచ్చిగా నిజం చెప్పాలంటే, ఆయన్ని కలుసుకోవాలని నాకు ఎటువంటి ఆపేక్షగాని, ఆరాటంగాని లేవనే చెప్పాలి. రామబహ్మంగారు నన్ను పదేపదే ఆహ్వానించడానికి నేను ఆయన బంధువునిగాని, స్నేహితుణ్ణిగాని కానేకాదు. ఆయన... నా అభిమాని!
ఇక్కడ నా గురించి కాస్త చెప్పుకోవాలి. నేనో ప్రముఖ కథా రచయితను. రామబ్రహ్మంగారికి నేనన్నా, నా కథలన్నా మాటల్లో చెప్పలేనంత వీరాభిమానం అని సగర్వంగా చెప్పుకోగలను.
రామబ్రహ్మంగారు నా కథలకు డైహార్డ్‌ ఫ్యాన్‌ అంటే– కాస్త అతిశయోక్తిగా ఉంటుందేమో కానీ, ఇది పచ్చి యదార్థం!

ఆయన నేను రాసిన ప్రతీకథనీ అనేకసార్లు చదువుతుంటారు అనడం కంటే, నిత్యపారాయణం చేస్తుంటారన్నది యధార్థం. నా మెదడులో జీవం పోసుకున్న నా రచనలూ, ఆయా రచనల్లోని పాత్రలూ, అందులోని సంభాషణలూ నాకే సరిగ్గా గుర్తుండి చావవు.
కానీ– ఆయన నేను రాసిన ప్రతివాక్యాన్ని గుర్తుంచుకుని, ఆయా పాత్రల పేర్లూ, స్వభావాలూ, తీరుతెన్నులను గురించి గంటల తరబడి చర్చిçస్తుంటారు. నా సాహిత్యం పట్ల ఆయనకుగల అభిమానానికీ, జ్ఞాపకశక్తికీ ఒక్కోసారి నేనే ఎంతగానో విస్తుపోతుంటాను.

రామబ్రహ్మంగారు నా కథల గురించే కాక ఇతర రచయితల కథల గురించి కూడా అనేకానేక సాహితీ సంగతులు నాతో చర్చిస్తుంటారు. అది ఎంతలా అంటే– నేను ఒక్కోసారి ఆయన ఫోన్‌ లిఫ్ట్‌ చేయడానికి కూడా భయపడిపోతుంటాను.
రామబ్రహ్మంగారు ‘మీ సమయాన్ని వృథా చేస్తున్నానను కుంటా...’ అని తరచు అంటుంటారు. కానీ నా కాలాన్ని హరించడం మాత్రం మానుకోరు. ఈమధ్య ఆయనకు డెబ్బయిఏళ్ళు నిండాయి. ఆ వయసుకి ఆ మాత్రపు చాదస్తం సహజమే కదాని సరిపెట్టుకుంటుంటాను.

రామబ్రహ్మంగారిని కలుసుకోడానికి కారణం– ఆయన తన డబ్బులతో నా రానూపోనూ ట్రైన్‌ టిక్కెట్లు బుక్‌ చేశారనే కృతజ్ఞతా భావంతోనన్నదే అసలైన వాస్తవం.
‘ఓ సాహితీమిత్రుని సన్మాన కార్యక్రమానికి హాజరవడానికి వస్తూ, మిమ్మల్నీ కలుస్తున్నాను’ అని నిజాన్ని చెప్పెయ్యాలనుకున్నాను. కానీ చెప్పలేకపోయాను. అలా చెప్తే ఆయనకు నాపైగల ఇంప్రెషన్‌ తగ్గిపోతుందని ఆ విషయాన్ని దాచిపెట్టేశాను.
నా మిత్రుని సన్మానం జరిగేరోజున అలా బయటికెళ్లి వస్తానని ఓ అబద్ధం చెప్పి, ఆ సభకు హాజరవ్వాలన్నదే నా ఆలోచన. ఇలా నాలోని ఆలోచనలు రైలుతో సమానంగా పరుగులు తీస్తున్నాయి.
∙∙ 
రైలు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ చేరుకుంది.
అప్పుడు సమయం సుమారుగా మధ్యాహ్నం రెండున్నర గంటలు కావస్తోంది. రామబ్రహ్మంగారు నాకోసమే ప్లాటుఫారం మీద ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మేమిద్దరం ఇదివరకెప్పుడూ కలుసుకోలేక పోయినా అనేకసార్లు మాట్లాడుకున్న వాట్సాప్‌ వీడియో కాల్స్‌ మూలంగా ఒకరినొకరం సునాయాసంగానే గుర్తుపట్టగలిగాం.

నేను ప్లాటుఫారం మీద అడుగుపెట్టగానే రామబ్రహ్మంగారు నాకు దగ్గరగా వస్తూ ‘‘హార్టీ వెల్కమ్‌ టు హైదరాబాద్, చైతన్యాజీ...’’ అంటూ అమితమైన ఆనందంతో అక్కున చేర్చుకున్నారు. అనంతరం నా లగేజీని తన చేతుల్లోకి తీసుకుని తను పార్క్‌ చేసిన కారు దగ్గరకు తీసుకుపోయారు. రామబ్రహ్మంగారు కారు డ్రైవింగ్‌ చేస్తున్నంతసేపు ఏదేదో లొడలొడా మాట్లాడుతూనే తనింటికి తీసుకుపోయారు.

రామబ్రహ్మంగారు నాకోసం తనింటిపైనున్న పెంట్‌ హౌస్‌లో వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఆ గదిలోకి అడుగుపెట్టిన నాకు మతిపోయినంత పనయింది. ఆ గదిలో కొన్ని వందల పుస్తకాలు దర్శనమిచ్చాయి. ఆ పుస్తకాల గది... అందమైన హరివిల్లులా వుంది. పుస్తకాలు ఓ పద్ధతిగా పేర్చి వున్నాయి. నాకు ఒక అద్భుత ప్రపంచంలో అడుగుపెట్టినట్టుగా అపురూపమైన భావన చోటుచేసుకుంది.
సాహిత్యానికి సంబంధించిన అనేక పుస్తకాలే కాకుండా, విజ్ఞానానికి సంబంధించిన గ్రంథాలు ఆ గదిలో ఉన్నాయి. కొంతమంది గొప్పవారుగా గుర్తింపు పొందాలనే తాపత్రయంతో ఏవేవో పుస్తకాలు కొనుక్కుని తమ అల్మరాల్లో ఊరకనే అలంకరించుకోవడం నాకు తెలిసిందే.

రామబ్రహ్మంగారు కూడా అలానే పుస్తకాలను కొనుక్కుని ఉంటారని భావించాను.
భోజనమయ్యాక మేడమీద గదికి తీసుకెళ్లారు. నా మనసులో వేధిస్తున్న ప్రశ్నలను ఆయన ముందు పెట్టాను. ‘రామబ్రహ్మంగారూ! ఇన్ని పుస్తకాలు కొనుక్కున్నారు కదా, వీటిల్లో కొన్నైనా పూర్తిగా చదివారా?‘అడిగాను కాస్త అనుమానంగా.
‘కొన్ని కాదు గురువుగారు, అన్నీ చదివేసినవే! ఉన్న పుస్తకాలు పూర్తిగా చదవడం పూర్తయితేనే కొత్త పుస్తకాలు తీసుకుంటాను’ అన్నారు రామబ్రహ్మంగారు– తనకున్న భయంకరమైన రీడింగ్‌ హాబిట్‌ను తెలియజేస్తూ. ఆయన మాటలకు నేను ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాను.

‘నిజంగానా...?!’ నోరెళ్ళబెడుతూ ఆశ్చర్యంగా అడిగాను. ఎందుకంటే– నేను నా దగ్గరున్న పుస్తకాలలో పదోవంతు కూడా చదివివుండను. రామబ్రహ్మంగారు ‘నాకు ఇంకేమి పని? చదువుకోవడమే నాకున్న ఏకైక వ్యసనం’ అన్నారు ఓ సాధారణ విషయాన్ని వెల్లడి చేస్తున్నట్టుగా.
ఆ రాత్రి నేను సరిగ్గా నిద్రపోలేకపోయాను.
రామబ్రహ్మంగారిని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆయనలో చాలా విషయం ఉందన్న విషయాన్నీ చాలా ఆలస్యంగా గ్రహించాను. నిజానికి ఆయన జ్ఞానం ముందు నేనెంతో అజ్ఞానినో నెమ్మదిగా అర్థమైంది.

రామబ్రహ్మంగారు నగరంలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనకి లాక్కుపోయారు. అక్కడ నా అభీష్టం మేరకు ఓ ఇరవైవేల రూపాయలు విలువచేసే పుస్తకాలు తీసుకున్నారు. తర్వాత అవన్నీ ‘నాకోసమే తన బహుమతి’ అన్నారు. నేను ఒక్కసారిగా అవాక్కయ్యాను.
ఆ మరుసటిరోజు రామబ్రహ్మంగారు మధ్యాహ్న భోజనం చేస్తున్నప్పుడు నన్ను సాయంత్రం ఓ చోటికి తీసుకువెళ్తామన్నారు. అప్పుడు నా పరిస్థితి మహా ఇరకాటంలో పడ్డట్టయింది. ఎందుకంటే– ఆ సాయంత్రమే నేను ముందుగా అనుకున్న ప్లాన్‌ ప్రకారం నా సాహితీ మిత్రుడు రంగనాథం సన్మాన కార్యక్రమానికి హాజరు కావాలి.

నేను వెంటనే ‘అయ్యో, ఈ సాయంత్రమే మియాపూర్లో ఓ మిత్రుణ్ణి కలవాలి...‘ ఓ రెడీమేడ్‌ అబద్ధంతో రామబ్రహ్మంగారి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాను. అయినాకానీ అతనూ కూడా వస్తామన్నారు. నేను తెలివిగా ‘మీకెందుకు అనవసర శ్రమ. ఒక్కడినే సరదాగా బస్సు మీద వెళ్ళొస్తాను...’ అని ఏదో సర్దిచెప్పి, తప్పించుకున్నాను. ఒక అబద్ధాన్ని నెత్తినపెట్టుకుని మోయాలంటే ఎంత కష్టమో ఆ క్షణంలో అర్థమయింది. వెంటనే ’నా మిత్రుని సన్మానసభకి హాజరవ్వాలి...’ అని ధైర్యంగా నిజం చెప్పెయ్యాలనిపించింది. కానీ గొంతు విప్పలేక, అపరాధ భావంతో తలదించుకోక తప్పలేదు.
∙∙ 
ఆ సాయంత్రం...
రామబ్రహ్మంగారితో కాఫీ తాగి, కాసిన్ని స్నాక్స్‌ తిని, స్నేహితుణ్ణి కలవడానికంటూ నా మిత్రుడు రంగనాథం సన్మానసభకి బయల్దేరాను.
రామబ్రహ్మంగారు తన కారు తీసుకెళ్లమన్నారు. నేను వద్దని చెప్పేశాను. కనీసం తన స్కూటీనైనా తీసుకెళ్లమన్నారు. రూట్స్‌ వెతుక్కోవడానికి కష్టమవుతుందని చెప్పి, బస్సులోనే వెళ్ళొచ్చేస్తానని చెప్పి, అతికష్టంమీద నా మిత్రుని సన్మాన సభకి బయల్దేరాను.
ఒక్కోసారి అభిమానం కూడా ఇంతలా బాధిస్తుందని తొలిసారిగా తెలుసుకున్నాను.
∙∙ 
అనుకున్నట్టు గానే బస్సెక్కి, ఎలాగోలా నా మిత్రునికి సన్మానం జరుగబోయే సభావేదిక వద్దకు చేరుకున్నాను.
నాకోసం ఎదురుచూసున్న నా సాహితీమిత్రుడు రంగనాథం నన్ను చూడగానే ఎంతో ఆనందంగా పలకరించాడు. ‘వ్యయప్రయాసలతో వచ్చినందుకు సంతోషమ’ంటూ నన్ను తన హృదయానికి హత్తుకుని తన సంతోషాన్ని వ్యక్తంచేశాడు.
నేనూ, రంగనాథం వేదికముందు గల కుర్చీల్లో పక్కపక్కనే కూర్చున్నాం. వేదికమీద కొద్దిమంది సాహితీమూర్తులు ఆసీనులై ఉన్నారు. సభ అప్పటికే మొదలైపోయింది.
నేను వేదిక మీదున్న పెద్దలను పరిశీలనగా చూశాను, నాకు తెలిసిన రచయితలెవరైనా వున్నారాని. అంతే నా చూపులు ఉన్నట్టుండి చప్పున ఆగిపోయాయి. ఒక్కసారిగా మ్రాన్పడిపోయాను.

నా కళ్ళను నేను నమ్మలేనట్టుగా మరింత పెద్దగా చేసుకుని చూశాను. ఔను, ఆయన కచ్చితంగా రామబ్రహ్మంగారే! వేదిక మీద కూర్చున్న రామబ్రహ్మంగారి కంట్లో ఎట్టిపరిస్థితుల్లోనూ పడకూడదని గట్టిగా అనుకుని, ముందు వరుసలో ఇబ్బందిగా ఉందని రంగనాథాన్ని బలవంతంగా వెనక్కు లాక్కొచ్చేశాను.

వేదిక మీదున్న సాహితీమూర్తులు ఒక్కొక్కరూ ప్రసంగిస్తున్నారు. కొద్దిసేపటి తరువాత రామబ్రహ్మంగారు తన సాహితీ ప్రసంగాన్ని అత్యద్భుతంగా కొనసాగించారు. తెలుగు సాహిత్యంలో చోటుచేసుకుంటున్న వివిధ ప్రక్రియల గురించి అనర్గళంగా ప్రసంగించారు. మధ్యమధ్యలో సభంతా చప్పట్లతో మార్మోగిపోతోంది. అందరితో పాటూ నేనూ చప్పట్లు కొట్టాను. నాలో పేరుకుపోయిన అహంకారం పొరలు పటాపంచలయ్యేలా గట్టిగానే నా అభిమానాన్ని వ్యక్తపరచాను.

ఆ కాసేపటికి తరువాత నా మిత్రుని సన్మాన కార్యక్రమం జరిగింది.
సభానంతరం నిర్వాహకులు భోజనం ఏర్పాట్లు చేశారు. రామబ్రహ్మంగారికి కన్పించకుండా భోజనం చేసేందుకుగా నా మిత్రుడితో కలిసి ఓ మూలవైపు అడుగులు వేశాను. ఒకచోట చాలామంది సాహితీప్రియులు గుమిగూడిన వాతావరణం కన్పించింది. నేను ఆసక్తిగా దూరం నుంచే గమనించాను. అక్కడ ఓ వ్యక్తితో చాలామంది ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ, అతనితో మాటలు కలపాలని అందరూ తెగ ఆరాటపడుతున్నారు. ఆ వ్యక్తి ఎవరోకాదు, రామబ్రహ్మంగారే!

నా మిత్రుడు రంగనాథం ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నేను ఎట్టిపరిస్థితుల్లోనూ రామబ్రహ్మంగారి కంటపడకూడదని అనుకుంటూనే, అటువైపుగా చూపు సారించాను. నేను తనని గమనిస్తున్నానని ఆయనకు తెలిసినట్టుగా ఆయన చప్పున నన్ను చూసేశారు.

అంతే నాకా క్షణంలో ఎలా స్పందించాలో అర్థంకాక తలకొట్టేసినట్టయింది. ఓ బలమైన సముద్రపు కెరటం నన్ను నిలువెల్లా ముంచేసినట్టుగా నా ఒళ్ళంతా సిగ్గుతో చచ్చిపోయింది. వెంటనే మొహంమీద బలవంతపు చిరునవ్వు ఒకటి పులుముకుని ఆయనకు దగ్గరగా అడుగులు వేశాను.

‘ఏంటీ, సార్‌ మీరిక్కడ...?’ రామబ్రహ్మంగారు ఆశ్చర్యపోతూ అడిగారు. వెంటనే అతను అడిగినదానికి ఎలా బదులివ్వాలో అర్థంకాక ‘బయలుదేరాక తెల్సింది. ‘ఈరోజే నా మిత్రుడు ఏదో పనిమీద ముంబై వెళ్లిపోయాడు. నా రచయిత మిత్రుడైన రంగనాథం ఫోన్‌ చేయడంతో ఇలా బయల్దేరి  వచ్చేశాను...’ అప్పటికప్పుడు ఓ రెడీమేడ్‌ అబద్ధాన్ని అల్లేశాను.
అంతలో ఓ వ్యక్తి రామబ్రహ్మంగారికి షేక్‌ హ్యాండ్‌ ఇస్తూ ‘‘సార్, మొన్ననే ‘ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’లో మీ ఆర్టికల్‌ చదివాను, అద్భుతం! కంగ్రాట్స్‌...’’ అభినందిస్తున్నారు.

నేను చొరవచేసుకుని అందరిని నెట్టుకుని రామబ్రహ్మంగారి దగ్గరకు వెళ్లి ‘సార్, మీరు పత్రికలకూ, జర్నల్స్‌కూ ఆర్టికల్స్‌ రాస్తుంటారా?! నాకెప్పుడూ చెప్పనేలేదు...’’ అంటూ నాలో తన్నుకొస్తున్న ఆశ్చర్యాన్ని వెళ్ళగక్కుతూ అడిగాను.
నేను అడిగిన ప్రశ్నకు చిన్నగా నవ్వేస్తూ ‘‘గురువుగారూ, అప్పుడప్పుడూ ఏవో రాస్తుంటాను. చెప్పుకోవడానికి నేను మీలాగా గొప్ప రచయితనైతే కాదుకదా?!’’ అన్నారు రామబ్రహ్మంగారు నిరాడంబరంగా.

ఇంతలో నా మిత్రుడు రంగనాథం మా దగ్గరకొచ్చాడు. అతన్ని రామబ్రహ్మంగారికి పరిచయం చేద్దామనుకుంటుండగా రంగనాథమే ‘‘ఆయన మా గురువుగారు ప్రముఖ కాలమిస్ట్‌ రామబ్రహ్మంగారు. ఈ మధ్యనే నాకు పరిచయమయ్యారు’’ అంటూ నాకు రామబ్రహ్మంగారిని పరిచయం చేయబోయాడు. ఆందుకు రామబ్రహ్మంగారు ‘‘మా గురువుగారికి, నాకూ ఇంతకుముందే పరిచయం వుంది...’’ అంటూ అసలు సంగతి బయటిపెడుతూ పెద్దగా నవ్వేశారు.

రామబ్రహ్మంగారు నన్ను ‘గురువుగారు’ అని సంబోధించడం నా మిత్రుడు రంగనాథానికి మింగుడు పడక, మా ఇద్దరివైపు ఆశ్చర్యంగా చూశాడు. ‘అవునండీ, మీ మిత్రుడి కథలకు నేను వీరాభిమానిని...’ అంటూ రామబ్రహ్మంగారు నన్నో ఎత్తయిన ఉన్నత శిఖరంమీద కూర్చోబెట్టారు. ఆ క్షణం నాకెందుకో అధఃపాతాళంలోకి జారిపోతున్న భావన.

ఆ సభా కార్యక్రమం అనంతరం నేనూ, రామబ్రహ్మంగారు ఆయన కారులో ఇంటికి బయలుదేరాం. తప్పుకి దొరికిపోయానన్న న్యూనతభావంలో ఇబ్బందిగా కారులో కూర్చున్నాను. రామబ్రహ్మంగారు యథాలాపంగా మాట్లాడుతున్నారు.

ఇంటికి చేరుకునేసరికి రాత్రి తొమ్మిదిన్నర కావస్తోంది. ఇద్దరం ఒకేసారి కారులో రావడంతో రామబ్రహ్మంగారి భార్య ‘‘అరే, మీరిద్దరూ ఎలా కలిశారు?’’ ఆశ్చర్యంగా అడిగారు. నేను మరో అబద్ధాన్ని సిద్ధం చేసుకుంటుండగా రామబ్రహ్మంగారే ఏదో చెప్పారు.
నేను ఆ భార్యాభర్తలిద్దరికీ గుడ్‌ నైట్‌ చెప్పి నేను నా రూమ్‌లోకి వెళ్ళి, బెడ్‌ మీద నిస్సత్తువగా వాలిపోయాను బట్టలు మార్చుకోకుండానే.

రామ బ్రహ్మంగారితో పరిచయమైన నాటినుంచి మామధ్య చోటుచేసుకున్న అనేక సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి. నాలోని అహంకారపు ఛాయలు నన్ను వెక్కిరిస్తూ పాతాళంలోకి నెట్టేస్తున్న దృశ్యపరంపర! ఆ రాత్రి ఎప్పుడో నాకు తెలియకుండా నిద్రలోకి జారిపోయాను.

ఉదయం రామబ్రహ్మంగారే నిద్రలేపారు. ఆ ఉదయమే నా ప్రయాణం. రామబ్రహ్మంగారు కూడా స్టేషన్‌ వరకు వస్తామన్నారు. అనవసరమైన ఇబ్బంది ఎందుకని బస్సులో వెళ్ళిపోతానని చెప్పాను. తనకు ఏ ఇబ్బందిలేదనీ, పైగా దగ్గరుండి సెండాఫ్‌ ఇవ్వడం తనకెంతో సంతోషమంటూ తన కారు తీశారు. నేను ఇంకేమీ మాట్లాడలేకపోయాను. ఆయన సాహచర్యం నుంచి వీలైనంత తొందరగా బైటపడాలనిపిస్తోంది. అంతులేని అపరాధభావం నాలోని అణువణువునూ దహించివేస్తోంది.

కారులోంచి దిగాక రామబ్రహ్మంగారు నా రెండు బ్యాగులను పట్టుకున్నారు. నా లగేజీని ఆయన మోయడం నాకే సిగ్గుగా అన్పించి, ఆయన చేతిలోని నా బ్యాగులను తీసుకోవడానికి తీవ్రప్రయత్నం చేశాను. ఆయన అంతే తీవ్రంగా ‘మై ప్లెజర్‌...’ అంటూ నా బ్యాగులను వదిలిపెట్టలేదు.

నా రానూపోనూ టికెట్స్‌ ముందుగానే రిజర్వేషన్‌ చేసేయడంతో రామబ్రహ్మంగారు తనకు ఓ ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌ తీసుకున్నారు. 
నేను ఎక్కాల్సిన స్పెషల్‌ ట్రైన్‌ అప్పటికే ప్లాట్‌ఫామ్‌ మీద సిద్ధంగా ఉండటంతో గబగబా ఎక్కి కిటికీ దగ్గర కూర్చున్నాను. రామబ్రహ్మంగారు ప్లాట్‌ఫామ్‌ మీద నుంచుని ‘గురువుగారూ, నా అతిథ్యంలో ఏమైనా లోపాలుంటే క్షమించగలరు...’ అన్నారు నన్ను మరింత బాధకు గురిచేస్తూ. నేను వెంటనే రామబ్రహ్మంగారికి నా రెండు చేతులెత్తి దణ్ణంపెడుతూ ‘‘గురువుగారూ, మీ ఆటోగ్రాఫ్‌ ప్లీజ్‌...’’ అంటూ ఓ పుస్తకాన్ని తెరిచి, జేబులోంచి పెన్ను తీసిచ్చాను.

‘‘అయ్యో, నేను మీకు ఆటోగ్రాఫ్‌ ఇవ్వడమేంటి? కొత్తగా నన్ను మీరు గురువుగారని సంబోధించడం ఏంటి?! నేనే ఎన్నోసార్లు మీరు ఆటోగ్రాఫ్‌ చేసిన మీ పుస్తకాలను మీనుండి పోస్టులో తెప్పించుకున్న వాణ్ణి...’’ అన్నారు రామబ్రహ్మంగారు తడబడుతున్న స్వరంతో.
నా కోరిక మేరకు ఇబ్బందిగా ఆటోగ్రాఫ్‌ చేసిచ్చారు. అప్పుడే రైల్వే గార్డు విజిల్‌ గట్టిగా వేశాడు. రైలు నెమ్మదిగా కదిలింది.
ఎందుకో ఉన్నట్టుండి నా కళ్ళల్లోంచి నీళ్లు తన్నుకువస్తున్నాయి. పూడుకుపోయిన నా గొంతు పెగుల్చుకుని ‘‘గురువుగారూ, ఇక మీదట మీరు నన్ను ‘గురువుగారూ’ అంటూ సంబోధించడానికి వీల్లేదు! ఈ అభిమాని అజ్ఞానాన్ని మన్నించగలరు...’’ అంటూ ప్రక్షాళన చెందిన మనసుతో నా రెండు చేతులెత్తి నమస్కారం చేశాను.
రామబ్రహ్మంగారు నా మాటలు అర్థంకానట్టుగా ఆశ్చర్యంగా నన్నే చూస్తున్నారు. ఆ క్షణంలో మా ఇద్దరిమధ్య మాటలు కరువయ్యాయి.
∙∙ 
రైలు మా మధ్య  భౌతికంగా దూరాన్ని పెంచుతూ ముందుకు సాగిపోతోన్నా, ఈ ప్రయాణం మమ్మల్ని ఎంతో దగ్గర చేసిందనే చెప్పాలి. ఎవరో మహానుభావుడన్నట్లు ప్రతీ ప్రయాణం... నీలోని నీకు తెలియని సరికొత్త మనిషిని నీకు పరిచయం చేస్తుంది! - శ్రీనివాసరావు తిరుక్కోవుళ్ళూరు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement