
ఉద్యోగ విరమణ అనంతరం విద్యార్థులకు తోడ్పాటు నోటు పుస్తకాలు, యూనీఫామ్ పంపిణీ
తన వంతు సాయంగా సమాజ సేవ చేస్తున్న ధర్మారావు దాతృత్వం
ప్రతి ఒక్కరికీ సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ సమయం లేక కొంతమంది.. ఆర్థిక స్తోమత లేక మరి కొంతమంది చేయలేని పరిస్థితి.. అలాంటివారు ఏమాత్రం అవకాశం దొరికినా తమ వంతుగా సమాజానికి సేవ చేయాలనే తలంపుతో ఉంటారు. అలాంటి వారిలో ఒకరే ధర్మారావు.. సేల్స్ టాక్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్గా విధులు నిర్వహించిన ఆయన ఉద్యోగ విరమణ అనంతరం తన వంతు సాయంగా సేవ చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు.. – మోతీనగర్
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరుకు చెందిన బి.ధర్మారావు ప్రస్తుతం మూసాపేట డివిజన్ మోతీనగర్లో నివాసం ఉంటున్నారు. ఉద్యోగ విధుల నిమిత్తం 1996లో కృష్ణాజిల్లా నుంచి నగరానికి బదిలీ అయ్యారు. డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ జులైలో 2004లో ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం ఆయన సతీమణి దివంగత బి.హైమావతి కోరిక మేరకు 2004 నుంచి నేటి వరకూ నిరంతరాయంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నోటు పుస్తకాలు, యూనిఫామ్, పాఠశాల ఫీజులు చెల్లిస్తున్నారు.
ఆమె ఆలోచన నుంచే..
మేము చదువుకున్న సమయంలో పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేక అవస్థలు పడ్డాం. ఈ నేపథ్యంలో నా భార్య హైమావతి ఆలోచన నుంచే ఉద్యోగ విరమణ అనంతరం మా వంతు సాయం చేయాలని నిర్ణయించు కున్నాం. ఆమె మరణానంతరం ఆమె జ్ఞాపకార్థం విద్యార్థులకు తోచిన విధంగా పరితోషికాన్ని సాయం చేస్తున్నా. అపార్టుమెంట్లో విధులు నిర్వహిస్తున్న వాచ్మెన్ పిల్లలకు నోటు పుస్తకాలు అందజేస్తున్నా. రానున్న రోజుల్లో హైమావతి జ్ఞాపకార్థం మరిన్ని కార్యక్రమాలు చేపడతా. – ధర్మారావు, రిటైర్డ్ డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్
భార్య జ్ఞాపకార్థం..
ప్రస్తుతం చిన్నకుమారుని వద్ద నివాసం ఉంటున్న ధర్మారావుకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. 2020లో ఆయన భార్య మరణానంతరం హైమావతి జ్ఞాపకార్థం.. 2021 నుంచి పుస్తకాలు, యూనీఫామ్ పంపిణీతో పాటు మూసాపేట డివిజన్లోని బబ్బుగూడ, యూసఫ్గూడ, వెంగళరావునగర్, ఇస్నాపూర్, శ్రీరామ్నగర్, రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాలలు, శ్రీరామ్ నగర్లోని ఉర్దూ మదరసాల్లో చదువుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన పదో తరగతి విద్యార్థులకు రూ.12వేల చప్పున ఫీజులను చెల్లిస్తున్నారు. గత ఐదేళ్లుగా పదో తరగతి మొదటి స్థానంలో ఉత్తీర్ణత సాధించిన, 500కు పైబడి మార్కులు సాధించిన 120 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు.