జూన్ 8 ప్రపంచ సాగర దినం
మనం నివసించే భూగోళం ఉపరితలం మీద దాదాపు 70% సముద్రాలే నిండి ఉన్నాయి. భూమ్మీద ఉండే నీటిలో దాదాపు 96.5% నీరు సముద్రాల్లోనే ఉంది. సముద్రాల్లోని నీటి ఘనపరిమాణం 130 కోట్ల ఘనపు కిలోమీటర్లు. భూమ్మీద వెలువడే కర్బన ఉద్గారాల్లో అత్య«ధిక మొత్తాన్ని పీల్చుకునేది సముద్రాలే! భూమ్మీద జీవరాశి మనుగడకు రక్షణ వలయంగా నిలుస్తున్న సముద్రాలు ఇప్పుడు కాలుష్యం బారిన పడుతున్నాయి.

ప్లాస్టిక్ వ్యర్థాలు, రసాయన వ్యర్థాలు సముద్రాల్లోకి మితిమీరి చేరుతున్నాయి. అంతర్జాతీయ సంస్థలు, పర్యావరణవేత్తలు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, సముద్రాల్లోకి చేరుతున్న కాలుష్యాలు ఏడాదికేడాది పెరుగుతూనే ఉన్నాయి. ఇవి పర్యావరణానికి తీరని నష్టం కలిగిస్తున్నాయి. సముద్రాలకు ఎదురవుతున్న కాలుష్యాల గురించి గణాంకాల్లో తెలుసుకుందాం...

సముద్రాలకు ప్లాస్టిక్ బెడద ఒకవైపు పెరుగుతుంటే, మరోవైపు రసాయనాల ముప్పు కూడా నానాటికీ పెరుగుతోంది. ఫలితంగా సాగర తీరాల్లో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయి, ఏడాదికేడాది సాగర తీర మృత ప్రాంతాలు (కోస్టల్ డెడ్ జోన్స్) పెరుగుతూ వస్తున్నాయి. వ్యవసాయంలో ఉపయోగించే నత్రజని, ఫాస్ఫరస్ ఎరువులు మితిమీరి సముద్రాల్లో కలుస్తున్నాయి. వీటివల్ల సముద్రాల్లో నాచు అతిగా పెరిగి, చనిపోయిన నాచు సముద్రాల అడుగుకు చేరుకోవడం వల్ల ఆ ప్రాంతాల్లో ఆక్సిజన్ తగ్గిపోతోంది. గడచిన దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన కోస్టల్ డెడ్ జోన్స్ వివరాలు గణాంకాల్లో...


