'ఇండ్ గ్యాప్' సాగు బాట.. రసాయనాల్లేని పంట! | A New Ind Gap Certification For Chemical Free Crops Sagubadi News | Sakshi
Sakshi News home page

'ఇండ్ గ్యాప్' సాగు బాట.. రసాయనాల్లేని పంట!

Jul 30 2024 8:42 AM | Updated on Jul 30 2024 8:42 AM

A New Ind Gap Certification For Chemical Free Crops Sagubadi News

రసాయనిక అవశేషాల్లేని పంటల కోసం సరికొత్త ‘ఇండ్‌ గ్యాప్‌’ సర్టిఫికేషన్‌

దీనితో వరి సాగులో లాభపడిన తుంగభద్ర సహకార సంఘం రైతులు

సాధారణ వరి సాగు కన్నా ఖర్చు తక్కువ, అధిక దిగుబడితో ΄ాటు అధిక ధర ΄÷ందిన వైనం

నగరాలు, పట్టణాల పరిసరాల్లో ఇండ్‌ గ్యాప్‌ పద్ధతిలో ధాన్యం, కూరగాయలు, పండ్లు సాగు చేస్తే రైతులకు, వినియోగదారులకూ మేలు!

రసాయనిక అవశేషాలు లేని నాణ్యమైన పంట దిగుబడులు పండించి ప్రజారోగ్యానికి పెద్దపీట వేసే దిశగా ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఇండియా గుడ్‌ అగ్రికల్చర్‌ ్రపాక్టీసెస్‌ (ఐ.జి.ఎ.పి.– ఇండ్‌ గ్యాప్‌) మంచి ఫలితాలనిస్తున్నాయి. అనేక మంది రైతులు గ్యాప్‌ పద్దతులకు అనుగుణంగా ఆహార పంటలు పండించేందుకు ఆసక్తి చూపుతున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని దశల వారీగా తగ్గిస్తూ, రసాయనిక అవశేషాల్లేని నాణ్యమైన, అధిక పంట దిగుబడుల ఉత్పత్తి సాధించటం ఇండ్‌ గ్యాప్‌ పద్ధతిలో ముఖ్యమైన అంశం.

తుంగభద్ర సేంద్రియ వ్యవసాయ ధాన్య విత్తన రైతుల పరస్పర సహాయ సహకార సంఘంలో సభ్యులైన రైతులు గ్యాప్‌ పద్ధతులను ఆచరిస్తూ ఆదర్శంగా నిలిచారు. 2023–24లో కర్నూలు జిల్లాలోని సీ.బెలగల్‌ మండలం కొండాపురం (రంగాపురం), గుండ్రేవుల గ్రామాల్లోని 50 మంది రైతులు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. గ్యాప్‌ పద్ధతులనుపాటిస్తూ బీపీటీ 5204 రకం వరి పంటను సాగు చేశారు. రైతులు ఒక్కొక్కరు అరెకరం నుంచి మూడు ఎకరాల వరకు మొత్తం 24.09 హెక్టార్లలో గ్యాప్‌ పద్దతులకు అనుగుణంగా వరి పండించారు.

గ్యాప్‌ నిబంధనల ప్రకారం వరి సాగు పూర్తిగా వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో జరిగింది. 10–15 రోజులకోసారి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పొలంబడి కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహించి రైతులకు గ్యాప్‌ పద్దతులపై అవగాహన కల్పించారు. కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, సి.బెలగల్‌ ఏవో మల్లేష్‌ యాదవ్, జిల్లా వనరుల కేంద్రం అధికారులు ప్రతి పొలంబడికి వెళ్లి పంటలను పరిశీలించి రైతులకు సూచనలు ఇస్తూ వచ్చారు.

కొండాపురం, గుండ్రేవుల గ్రామాల్లోని 50 మంది రైతుల్లో ప్రతి రైతు 100 శాతం గ్యాప్‌ పద్దతులుపాటించారు. నాట్లకు ముందు సామూహికంగా పచ్చి రొట్ట ఎరువు పంట సాగు చేసి, పూత దశలో పొలంలో కలిపి దున్నేశారు. ఎకరాకు 3–4 టన్నుల పశువుల ఎరువు వేసుకున్నారు. కొందరు రైతులు వేపచెక్క, వర్మీ కంపోస్టు కలిపి వేసుకున్నారు. పురుగుల బెడదను తగ్గించుకునేందుకు ఎకరాకు 5–6 లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు ఏర్పాటు చేసుకున్నారు. సాధారణంగా రసాయనిక వ్యవసాయం చేసే రైతులు ఈ ్రపాంతంలో ఎకరానికి 6–8 బస్తాల రసాయనిక ఎరువులు వేస్తూ ఉంటారు.

గ్యాప్‌ పద్ధతిలో 4 బస్తాల వరకు రసాయనిక ఎరువులు, అనుమతించిన కొన్ని పురుగుమందులను తగు మోతాదులో మాత్రమే ఉపయోగిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. పంట సాగు కాలంలో ఏపీ ఆర్గానిక్‌ సీడ్‌ సర్టిఫికేషన్‌ ఏజెన్సీ అధికారుల బృందం మూడు దఫాలు పరిశీలించింది. వరి కోతలు పూర్తి కాగానే మూడు శ్యాంపుల్స్‌ సేకరించి గుంటూరులోని వ్యవసాయ శాఖ ల్యాబ్‌కు పంపారు. అక్కడ జరిపిన పరీక్షల్లో రసాయనిక అవశేషాల ప్రభావం జీరో ఉన్నట్లు స్పష్టం కావడంతో సర్టిఫికేషన్‌ అథారిటీ ఈ సొసైటీ రైతులకు ఉమ్మడిగా ఇండ్‌ గ్యాప్‌ సర్టిఫికెట్‌ను 2024 జనవరిలో జారీ చేసింది. ఆ తర్వాత రైతులు వరి ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయించి బియ్యాన్ని మంచి ధరకు అమ్ముకున్నారు.

దిగుబడితో పాటు ధరా ఎక్కువే!
అతిగా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడి ధాన్యం పండించిన రైతులు బియ్యం క్వింటాలు రూ.5,500 ప్రకారం విక్రయించుకుంటే, ఇండ్‌ గ్యాప్‌ సర్టిఫికెట్‌ పొందిన సహకార సంఘం రైతుల బియ్యానికి రూ.7,000 ధర లభించింది. మామూలుగా అయితే వరి సాగులో ఎకరాకు సగటున రూ. 45 వేల వరకు పెట్టుబడి వ్యయం అవుతుంది. ఇండ్‌ గ్యాప్‌ పద్ధతిలో ఖర్చు రూ.28 వేలు మాత్రమే. సగటున ఎకరాకు ధాన్యం దిగుబడి 2.51 క్వింటాళ్లు అదనంగా వచ్చింది. మొత్తం 50 మంది రైతులు 24.09 హెక్టార్లలో 102.9 టన్నుల దిగుబడి సాధించి రూ. 71 లక్షల ఆదాయం పొందారు. సాధారణ రసాయనిక వ్యవసాయ రైతులతో పోల్చితే ఇది రూ. 14.4 లక్షల అధికం కావటం విశేషం. ఈ స్ఫూర్తితో తుంగభద్ర సహకార సంఘం రైతులు ఈ ఏడాది కూడా గ్యాప్‌ పద్ధతిలోనే వరి సాగు కొనసాస్తున్నారు. – గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు (అగ్రికల్చర్‌)

నికరాదాయం పెరిగింది..
8 ఎకరాల వ్యవసాయం చేస్తున్నా. నేను 2.75 ఎకరాల్లో ఇండ్‌ గ్యాప్‌ పద్ధతిలో వరి సాగు చేశాను. మిగతా పొలంలో పత్తి, ఉల్లి, మొక్కజొన్న పంటలు సాధారణ పద్ధతిలోనే పండిస్తున్నాను. సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్తల సూచనలు చాలా ఏళ్లుగాపాటిస్తుండటంతో గ్యాప్‌ పద్ధతిని అనుసరించటం నాకు సులువైంది.వేప చెక్కను ఎక్కువగా వినియోగించడం, గో ఆధారిత పద్దతులుపాటించడం వల్ల పంట భూముల్లో సూక్ష్మ జీవులు విశేషంగా అభివృద్ది చెంది వరి పంట ఎదుగుదలకు తోడ్పడుతున్నాయి. కెమికల్స్‌ వాసన లేకుండా వరి పండించాను.

మామూలుగా అయితే ఎకరాకు వరి సాగులో రూ.45–50 వేల వరకు పెట్టుబడి వ్యయం వస్తుంది. గ్యాప్‌ పద్ధతులుపాటించడం వల్ల ఎకరాకు రూ.28 వేలు చొప్పున 2.75 ఎకరాల్లో రూ. 77 వేలు ఖర్చయింది. 41 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. మిల్లింగ్‌ చేయగా 27 క్వింటాళ్ల బియ్యం వచ్చాయి. కర్నూలు తీసుకెళ్లి క్వింటా రూ.7,000కు అమ్మాను. క్వింటాకు రూ. వంద రవాణా ఖర్చు వచ్చింది. రూ.1.09 లక్షల నికరాదాయం వచ్చింది. మా సంఘంలోని 50 మంది రైతుల్లో క్వింటా బియ్యం రూ.7,500కి అమ్మిన వాళ్లూ కొందరు ఉన్నారు. ఈ ఏడాది కూడా గ్యాప్‌ పద్ధతిలోనే వరి సాగు చేస్తున్నాం. – పి.మధుసూదన్‌రెడ్డి (94900 96333), రైతు, కొండాపురం, సీ.బెలగల్‌ మండలం, కర్నూలు జిల్లా

ఇండ్‌ గ్యాప్‌ సర్టిఫికేషన్‌కు శ్రీకారం..
ఇండ్‌ గ్యాప్‌ పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తులకు దేశంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. మన దేశంలో అమలయ్యే గ్యాప్‌ పద్ధతులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(క్యు.సి.ఐ.) ‘ఇండ్‌ గ్యాప్‌’ సర్టిఫికేషన్‌ను అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం 2023–24 ఖరీఫ్‌ నుంచి ఏపీ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణ సంస్థ ద్వారా ఈ ఇండ్‌ గ్యాప్‌ సర్టిఫికేషన్‌ వ్యవస్థ రైతులకు దేశంలోనే తొలిగా అందుబాటులోకి తెచ్చింది. 2023–24లో ఏపీలోని ప్రతి జిల్లాలో పైలెట్‌ ్రపాజెక్టు కింద ఒక పంటను గ్యాప్‌ పద్ధతిలో పొలంబడిలో భాగంగా సాగు చేయించడం విశేషం.

ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్న అనేక సహకార సంఘాలు, ఎఫ్‌.పి.సి.లు వ్యవసాయ శాఖ పొలంబడి కార్యక్రమం ద్వారా ఇండ్‌ గ్యాప్‌ పద్ధతులను అనుసరించి లబ్ధిపొందటం విశేషం. విత్తన ధృవీకరణ సంస్థ ద్వారా ఉత్పత్తులపై పరీక్షలు చేయించి రైతులకు ఈ సర్టిఫికేషన్‌ ఇస్తారు. తద్వారా రైతులు మంచి మార్కెట్‌ ధరకు విక్రయించి మంచి నికరాదాయాన్ని పొందుతున్నారు. దిగుబడులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా క్రమంగా కెమికల్‌ వాడకాన్ని తగ్గిస్తూ.. అదే సమయంలో సేంద్రియం వైపు మళ్లే విధంగా రైతుల్లో అవగాహన కల్పించడం గమనార్హం.

ఇవి చదవండి: పిల్లల నుంచి పోషణ కోసం.. తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించవచ్చా?

Advertisement
 
Advertisement
Advertisement