
ధరలు లేక రైతులు విలవిల తోటలోనే వదిలేసిన మామిడి కాయలు
బరువెక్కిన హృదయంతో చెట్లు నరికివేత
ప్రకటనలకే పరిమితమైన కూటమి ప్రభుత్వ సాయం
రాష్ట్ర మంత్రి వచ్చి వెళ్లిన తరువాత ర్యాంపులు మూసివేత
ర్యాంపుల మూసివేతతో మరింత కష్టాల్లో అన్నదాతలు
తిరుపతి రూరల్ /పాకాల : మామిడి ధరలు పతనమవడంతో రైతులు విలవిలలాడుతున్నారు. కాయలు కోయకుండానే తోటల్లోనే వదిలేస్తున్నారు. కళ్ల ముందు కాయలు నేలరాలి కుళ్లిపోతుండడం చూసి తట్టుకోలేని కొందరు రైతులు నష్టపోతామని తెలిసినా కోత కోసి మండీల వద్దకు తీసుకొచ్చి నిరీక్షిస్తున్నారు. మరోవైపు ఫ్యాక్టరీల నుంచి అనుమతి రాక ఎగుమతి లేక మండీల వద్దకు చేరిన మామిడి అక్కడే మగ్గిపోతోంది. మామిడి రైతులు ఫ్యాక్టరీలకు వెళ్లలేక, మండీలకు చేరిన సరుకు పంపడానికి వీలు లేక రోడ్లపై పారేస్తున్నారు. ఆరుకాలం కష్టపడి పండించిన మామిడి పంటను కొనేవారు కరువవడంతో రైతు కంట కన్నీరు కారుతోంది. బరువెక్కిన హృదయంతో వెనుదిరిగి వెళుతున్న రైతులు ఈ ప్రభుత్వంలో బతకలేమని మామిడి చెట్లను నరికివేస్తున్నారు.
మామిడి ధరలు జిల్లాలో రోజు రోజుకు పతనమవుతుండడంతో అన్నదాత గుండె తరుక్కుపోతోంది. కళ్ల ముందే కాయలు తోటల్లోనే రాలిపోతుంటే ఆశలు కూలిపోతున్నాయి. మండీలు, ర్యాంపుల వద్ద తోతాపురిని అడిగేవారే లేకపోవడంతో ట్రాక్టర్లలో తెచ్చిన మామిడిని నేలపాలు చేసి విలపిస్తున్నారు. ఈక్రమంలో కడుపు మండిన అన్నదాత తన చేత్తోనే గారాబంగా పెంచుకున్న మామిడి చెట్లను నిలువునా నరికివేస్తూ కన్నీరు కారుస్తున్నారు. రైతన్నను ఆదుకోని ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
జిల్లాల్లో అతిపెద్ద మ్యాంగో మార్కెట్ అయిన దామలచెరువులో సుమారు 150 వరకు మామిడి సేకరణకు అవసరమైన మండీలు ఉన్నాయి. మండీలతో పాటు 30వరకు ర్యాంపులు ఏర్పాటు చేయడంతో చాలా మంది మామిడి వ్యాపారులు బయటి నుంచి వచ్చి ర్యాంపుల వద్ద లోడింగ్ చేసుకుని మామిడి పంటను కొనుగోలు చేసి వెళ్లేవారు. అదంతా గత ఏడాది. ఈ ఏడాది మామిడి పంట అధికం కావడం, ప్రభుత్వం అవసరమైన మేరకు ఫ్యాక్టరీలు తెరిపించలేకపోవడంతో «మామిడి ధరలు పడిపోయాయి. ప్రధానంగా తోతాపురిని కొనేవారు లేక రోడ్ల పక్కన పడేసి వెళుతున్నారు. కొంత మంది రైతులు ర్యాంపుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. చాలా ప్రాంతాల్లో రైతులు కాయలు కోయకుండా చెట్లలోనే వదిలేస్తున్నారు. మామిడి రైతులు పడుతున్న కష్టాలు చూసి వ్యాపారులు తోతాపురి కేజీ రూ.2 నుంచి రూ. 3 చెల్లిస్తామని చెప్పడంతో రైతన్నలు దానికి కూడా పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది. మామిడి పంట ఆరంభం నుంచే ధరలు విపరీతంగా పడిపోతున్నా ప్రభుత్వం ముందు చూపు లేకపోవడంతో సగానికిపైగా మామిడి పంట పొలాల్లోనే ఆగిపోయిందని బాధిత రైతులు గగ్గోలు పెడుతున్నారు.
సిండి‘కేటు’తో సమస్య
మామిడి గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు, వ్యాపారులు, దళారీలు సిండికేట్ కావడంతో తోతాపురిని అమ్ముకోలేక రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. గుజ్జు పరిశ్రమలు, ర్యాంపుల్లో టన్ను తోతాపురి రూ.8కు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా అది ఎక్కడా అమలు కావడం లేదు. తోటల్లో పక్వానికి వచ్చిన కాయలను ఎలాగోలా ర్యాంపుల వద్ద కొనాలని దళారీలను రైతులు బతిమాలుకుంటున్నారు. దీంతో దళారీలు రూ.3కు కొనుగోలు చేసి గుజ్జు పరిశ్రమలకు రూ.6తో సరఫరా చేస్తున్నారు. ఇలా ఫ్యాక్టరీ యజమానులు, దళారులు, వ్యాపారులు సిండికేట్ కావడంతో రైతుల కడుపు మండుతోంది. మరోవైపున ర్యాంపు యాజమాన్యాలు లాభాలు ఆర్జిస్తున్నా రైతులకు కోత కూలీ, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు.
అప్పుడు చెరకు.. ఇప్పుడు మామిడి
గతంలో చెరకు పంట విస్తారంగా సాగు చేస్తున్న రైతుల నుంచి నల్లబెల్లం కొనుగోలు చేయరాదని చంద్రబాబు సర్కారు నిషేధం పెట్టడంతో రైతులకు చెరకు పంటను దూరం చేశారు. ఆ తరువాత పాడి రైతులపై ఆధారపడి బతుకుదామంటే హెరిటేజ్ సంస్థను తెరమీదకు తెచ్చి ప్రభుత్వ పాల డెయిరీలను మూత వేయించి పాల ధరలను తగ్గించేశారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. తాజాగా మామిడికి సరైన గిట్టుబాటు ధర కల్పించలేక, ఫ్యాక్టరీలను తెరిపించలేక చేతులు ఎత్తేయడంతో మామిడి రైతులు రోడ్డున పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కడుపు మండి చెట్లు నరికివేత
కూటమి ప్రభుత్వంలో మామిడి రైతులు ఆర్థిక కష్టాలు రెట్టింపు అయ్యాయని ఆవేదన చెందుతున్నారు. చిత్తూరు జిల్లా పూతలపుట్టు మండలం పోటుగనుమ గ్రామానికి చెందిన రైతు నాగరాజ నాయుడు మామిడి పంటను దామలచెరువుకు తీసుకువెళ్లగా అడిగేవారు లేరు. తన మూడు ఎకరాల మామిడి తోటలో నుంచి 6 టన్నుల తోతాపురి మామిడి పంటను అమ్మకానికి తీసుకెళ్లగా ఎవ్వరూ కొనుగోలు చేయకపోవడంతో రోజంతా అక్కడే పడిగాపులు పడ్డాడు. ఆ తరువాత ఎంతో కొంత ఇచ్చేసి తీసుకోవాలని వ్యాపారులను ప్రాధేయపడటంతో డబ్బు ఇప్పుడు ఇవ్వలేమని రూ.3 లెక్కన సరుకు దించివెళ్లాలని ఆ వ్యాపారి చీటి రాసిచ్చాడు. ఆ చీటి తీసుకుని ఇంటిముఖం పట్టిన రైతు నాగరాజనాయుడు చేతి నుంచి రవాణా ఖర్చులు, కూలీలు సుమారు 13 వేలు చెల్లించాల్సి వచ్చింది. కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేక, ఖర్చులు భరించలేక ఆ చెట్లు ఎందుకన్న కోపంతో గొడ్డలి తీసుకువెళ్లి మొదళ్లకు నరికి వేశారు. బిడ్డలా పెంచుకున్న మామిడి మొక్కలను చేజేతులా నరికేయాల్సిన పరిస్థితి తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శలతో దుమ్మెత్తిపోశాడు. అలాగే గంగాధర నెల్లూరు నియోజకవర్గం కొత్తపల్లి మిట్టకు చెందిన రైతు మనోహర్రెడ్డి తన మామిడి పంటను బీడు భూమిలో పడేశారు.
అప్పుడు రూ.8.. ఇప్పుడు రూ.3
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నానితో పాటు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు అందరూ దామలచెరువు మ్యాంగో మార్కెట్కు వెళ్లి తోతాపురి ఒక కిలో రూ.8 కచ్చితంగా ఇవ్వాల్సిందే.. ఆపై రూ.4 ప్రభుత్వం నేరుగా రైతులకు ఇస్తుందని హుకుం జారీ చేశారు. ర్యాంపులు వద్ద కూడా అలాగే ధరలు పెట్టాలని ఒత్తిడి చేశారు. దీంతో ర్యాంపుల వద్ద కొనుగోళ్లు చేస్తున్న వ్యాపారులు పత్తా లేకుండా పారిపోవడంతో ర్యాంపులు అన్నీ మూత వేయాల్సి వచ్చింది. ఇక మండీల నుంచి ఎగుమతులు చేసే వ్యాపారులు సైతం బాగా కలర్ ఉన్నా కాయలకు రూ.6 చెల్లించి పచ్చగా వున్న వాటికి రూ.4 చెల్లిస్తూ వచ్చారు. ర్యాంపులు మూసివేయడంతో మండీల వద్దకు మామిడి పంటను అధికంగా తీసుకు రావడంతో నాలుగు రోజులుగా కిలో రూ.3కు కొనుగోలు చేస్తూ అంతకు మించి ఇవ్వలేమని తేల్చి చెబుతున్నారు. అది కూడా మూడు నెలల తరువాత చెల్లిస్తామని చెబుతున్నారు. దీంతో రైతులు సరుకు అప్పగించి వ్యాపారి రాసిచ్చిన చీటి చేతబట్టుకుని ఒట్టి చేతులతో ఇంటి ముఖం పడుతున్నారు.