వెంటాడి వేటాడి నరికి చంపిన దుండగులు
తిరుపతి క్రైం: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపం సముదాయంలో బుధవారం రాత్రి జంట హత్యలు కలకలం రేపాయి. ఒక మహిళతో పాటు నలుగురు వ్యక్తులు వెంటాడి వేటాడి కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో జీవకోన ప్రాంతానికి చెందిన మునిరత్నం(50) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సుబ్బారెడ్డి నగర్కు చెందిన మణికంఠ(41)ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మావతి కళ్యాణ మండపం సముదాయంలో నాలుగు కళ్యాణ మండపాలున్నాయి.
బుధవారం రాత్రి ఒక మండపంలో వివాహం జరుగుతోంది. రాత్రి 9.30 గంటల సమయంలో కొందరు దుండగులు రెండు బైక్లపై అక్కడికి చేరుకున్నారు. కల్యాణ మండపం సముదాయంలోని నిర్మానుష్య ప్రాంతంలో మునిరత్నం, మణికంఠపై వారు దాడి చేశారు. మునిరత్నం, మణికంఠ చిరువ్యాపారులు. మునిరత్నం రెండు నెలల కిందట ఓ వివాహం జరిపించాడు. దాని నేపథ్యంలో ఏర్పడిన వివాదమే ఈ దారుణానికి దారితీసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. కాగా, ఘటనలోని కొన్ని దృశ్యాలను పద్మావతి కళ్యాణ మండపంలో విధులు నిర్వర్తిస్తున్న వాచ్మన్ తన సెల్ఫోన్లో చిత్రీకరించినట్టు తెలిసింది.


