ఇంతవరకు అధిక జనాభా అన్న మాటలే విన్నాం. భారత్, చైనా దేశాలు అనగానే అధిక జనాభానే గుర్తుకొస్తుంది. అత్యధిక జనాభా కలిగిన దేశాలు అంటే ఠక్కున గుర్తొచ్చేవి ఇవే. కానీ జనాభా తగ్గిపోయినా..ఒక్కసారిగా సంతానం కనుమరుగైతే పరిస్థితి ఎంత హృదయవిదారకంగా, ఘోరంగా ఉంటుంది అనేందుకు ఈ గ్రామమే ఉదాహరణ. ఏమైందో గానీ ఒక్కసారిగా ఆ దేశంలోని గ్రామం జనాభా కుంటుపడిపోయింది..అనూహ్యంగా వృద్ధుల జనాభా పెరుగుతోంది..పాఠశాలలకు వెళ్లే చిన్నారులు లేక మూతపడేపరిస్థితికి వచ్చేశాయ్. కారణం తెలిస్తే విస్తుపోవడం ఖాయం. ఇంతకీ ఈ దారుణమైన పరిస్థితి ఎక్కడంటే..
ఇటలీలోని పర్వత గ్రామమైన పగ్లియారా డీ చిన్నగ్రామమైనప్పటికీ అక్కడ నెలకొన్న పరిస్థితి ఇటలీ అంతటా ఉన్న పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. అక్కడ పాఠశాలలు ఖాళీగా దర్శనమిస్తాయి. కేవలం వృద్ధ జనాభానే అధికంగా కనిపిస్తుంది. అక్కడి గ్రామాలు, పట్టణాలు మనుషులు సందడి లేక వెలవెలబోయాయి. అక్కడ ఎటుచూసినా యథేచ్ఛగా తిరుగుతున్న పిల్లులు దర్శనమిస్తుంటాయి.
నిజానికి ఆ గ్రామంలో దశాబ్దాలుగా జనాభా క్షీణతతో నిశబ్దం అలుముకుంది. ఆ నిశబ్దాబ్న్ని చేధిస్తున్నట్టుగా సుమారు 30 ఏళ్ల తర్వా తొలి బిడ్డ జననం..ఒక్కసారిగా ఆ గ్రామాన్ని ఆనందకేళి ముంచెత్తింది. ప్రస్తుతం ఆ చిన్నారి రాకతో ఆ గ్రామ జనాభా 20కి చేరిందట. ఆ చిన్నారి పేరు లారా బుస్సీ ట్రాబుకో. ఆమెను చూసేందుకు చుట్టపక్కల గ్రామాలతో సహ, ఇంతవరకు ఈ పగ్లియారా డీ అనే గ్రామం పేరు వినని వాళ్లు సైతం ఇక్కడకు తరలి రావడం విశేషం.
అక్కడ ప్రసవాలు అరుదు కావడంతో లారా ప్రధాన ఆకర్షణగా మారింది. లారా తల్లి సిన్జియా ట్రాబుకో..తన కూతురు జననంతో మా ఊరి పేరు కూడా వార్తల్లో నిలిచిందంటూ మురిసిపోయింది. కేవలం తొమ్మిదినెలలు వయసుకే ఎంత ఫేమస్ అయ్యిందో అంటూ కూతురుని చూసి తడిసి ముద్దవుతోంది ఆ తల్లి. ఇక్కడ ఆ చిన్నారి లారా జననం అక్కడ వారిందరిలో ఆనందాన్నినింపినప్పటికీ..ఈ ఘటన ఒకరకంగా ఆక్కడ ఉన్న తీవ్రమైన జనాభా సమస్యను హైలెట్ చేసింది.
జాతీయ గణాంకాల ప్రకారం..2024లో అక్కడ జననాల సంఖ్య మూడు లక్షలకు పడిపోయింది. గత 16 ఏళ్లుగా పరిస్థితి అలానే కొనసాగుతోంది. అక్కడ సంతానోత్పత్తి రేటు కూడా రికార్డు స్థాయిలో కనిష్టానికి చేరుకుంది, అలాగే మహిళలు సగటున కేవలం 1.18 మంది పిల్లలను మాత్రమే కంటున్నారు.
కారణాలు..
సరైన ఉద్యోగం లేకపోవడం, యువత విదేశాలకు వెళ్లడం, ఉద్యోగం చేసే తల్లులకు మద్ధతు లేకపోవడం..దీనికి తోడు పురుషలలో వంధ్యత్వం సమస్యలు అధికంగా ఉండటం, కొందరు జంటలు పిల్లలను వద్దనుకోవడం తదితర కారణాల రీత్యా జనాభా క్షీణిస్తుండటం మొదలైంది. 2025 నాటి జననాల సంఖ్య మరింత దారుణంగా పడిపోతూ వచ్చింది.
ఇది ఒక్క పాగ్లియారా డీ మార్సిలో కనిపిస్తున్న పరిస్థితి కాదు..మొత్తం ఇటలీలోనే ఇదే పరిస్థితి. ఇది ప్రభుత్వ సేవలు, ఆర్థివ్యవస్థపై ఒత్తిడిని పెంచుతోందట. జనాభా క్షీణించినా కూడా .. పరిస్థితి ఇంత అధ్వానన్నంగా ఉంటుందా అని అనిపిస్తోంది కదూ..!.
(చదవండి: 'వర్క్–లైఫ్'లలో ఏది ముఖ్యం? జెన్-జడ్ యువతరం ఏం అంటుందంటే..)


