
దేశంలో పెరిగిన మాంసాహార వాడకం
తగ్గిన కూరగాయల వినియోగం
తొలి స్థానంలో పాలు, పాల ఉత్పత్తులు
వినియోగ వ్యయంలో టాప్లో ఆహారం
దుస్తులు, పాదరక్షలకు ఖర్చు తగ్గించిన జనం
సాక్షి, స్పెషల్ డెస్క్: ముక్క లేనిదే ముద్ద దిగని కుటుంబాలు మన దేశంలో ఎన్నో. భారతీయులు ఆహారంపై ఏటా చేస్తున్న వ్యయంలో మాంసాహారం వాటా దశాబ్ద కాలంలో 8 నుంచి 10.8 శాతానికి ఎగబాకింది. కేంద్ర గణాంక శాఖ ఇటీవల విడుదల చేసిన ‘నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్–2025’ ప్రకారం.. ఈ పదేళ్లలో కూరగాయల స్థానాన్ని వెనక్కినెట్టి మాంసాహారం ఒక మెట్టు ఎక్కడం ఆసక్తికరమైన విషయం. దేశంలో మొత్తం వినియోగ వ్యయంలో తొలి స్థానం ఆహారానిదే. ఆహార పదార్థాలకు భారతీయ కుటుంబాలు ఏటా చేస్తున్న వ్యయంలో పాలు, పాల ఉత్పత్తులు; బ్రెడ్, తృణధాన్యాలు, పప్పులు; పండ్లు తొలి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. భారతీయుల ఆహారపు అలవాట్లు గత పదేళ్లలో చాలా మారాయి. కొత్త తరం.. కొత్తకొత్త ఆహార ఉత్పత్తులు తయారుచేసే సంస్థలు.. సరికొత్త వెరైటీలు.. ఇవన్నీ మన ఆహారపు అలవాట్లను ప్రభావితం చేశాయి. పదేళ్ల కిందట దేశంలో కూరగాయల వినియోగమే ఎక్కువగా ఉండేది. ఆ తరువాతి స్థానం మాంసాహారానిది. 2013–14లో 10.8 శాతం వాటాతో నాలుగో స్థానంలో ఉన్న కూరగాయలను అదే వాటాతో దశాబ్ద కాలంలో మాంసాహారం భర్తీ చేసింది. 10.6 శాతం వాటాతో కూరగాయలు 5వ స్థానానికి దిగొచ్చాయి.
పెరిగిన ఆహార స్పృహ
కరోనా తరువాత ప్రజల్లో ఆహార స్పృ హ బాగా పెరిగింది. ముఖ్యంగా ప్రోటీన్, విటమిన్లు.. ఇలా పోషకాలమీద అవగా హన పెంచుకుని, అవి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలవైపు మళ్లారు. అందుకే నేమో.. 2013–14తో పోలిస్తే 2023–24 నాటికి ఆహార పదార్థాలకు వెచ్చించిన మొత్తంలో పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, సముద్ర ఉత్పత్తులు, మాంసం, గుడ్ల వాటా గణనీయంగా పెరిగింది. అలాగే బ్రెడ్, తృణధాన్యాలు, పప్పులు, పండ్లు, కూరగాయలు, నూనెలు, కొవ్వులు, చక్కెర, జామ్, చాకోలెట్స్, కన్ఫెక్షనరీకి చేస్తున్న ఖర్చులను జనం తగ్గించారు.
ఖర్చుకు వెనుకాడడం లేదు..
గతంతో పోలిస్తే ప్రజలు.. ఖర్చుకు ఏమా త్రం వెనుకాడడం లేదని గణాంకాలు చెబుతున్నా యి. దేశవ్యాప్తంగా మొత్తం కుటుంబాల విని యోగ వ్యయం 2023–24లో రూ.99,10,363 కోట్లకు చేరుకుంది. 2013–14లో ఇది రూ.55,93,183 కోట్లు మాత్రమే. గత దశాబ్దంలో సగటున 5.9% వార్షిక రేటుతో వృద్ధి నమోదు కావడం గమనార్హం. గృహాలు, గృహాలకు సేవలందించే లాభాపేక్షలేని సంస్థలు.. ఆహారం, దుస్తులు, గృహ నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, విద్య, వినోదం వంటి వస్తు, సేవలపై చేసే మొత్తం ఖర్చును ప్రైవేట్ తుది వినియోగ వ్యయం అంటారు. పదేళ్లలో ఈ వ్యయం 77 శాతం పెరిగిందంటే అతిశయోక్తి కాదు.
రెస్టారెంట్లలో తాకిడి..
మొత్తం కుటుంబాల వినియోగ వ్యయంలో 2013–14తో పోలిస్తే 2023–24 నాటికి ఆహారం, నాన్ ఆల్కహాల్ పానీయాల వాటా తగ్గినప్పటికీ ఈ విభాగం 26.4 శాతంతో తొలి స్థానంలో నిలిచింది. ఇంటి వంటకంటే... రెస్టారెంట్లు, హోటళ్లలో తినడాన్ని ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే, బయటి టిఫిన్లు, భోజనాల కోసం చేస్తున్న ఖర్చులు గతంతో పోలిస్తే పెరిగాయి. మొత్తం వినియోగ వ్యయంలో రవాణా ఖర్చుల వాటా 14.3 శాతం నుంచి దాదాపు 19 శాతానికి ఎగబాకడం విశేషం. ఆరోగ్యం, విద్యకు చేసిన వ్యయాల వాటా పెరిగింది. ఆల్కహాల్, పొగాకు, నార్కోటిక్స్ వ్యయాల వాటా 21.7 శాతం క్షీణించింది. కమ్యూనికేషన్, గృహాలంకరణకు చేసే ఖర్చులు ఎక్కువయ్యాయి. దుస్తులు, పాదరక్షల కోసం ఖర్చులు తగ్గించారు.