ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)కి సంబంధించిన శ్రామికశక్తిలో ఇప్పుడు అయిదుగురిలో ఒకరు మాత్రమే మహిళ ఉన్నారని, 2027 నాటికి మహిళల సంఖ్య గణనీయంగానే కాదు, ఘననీయంగానూ పెరగనుందని చెబుతోంది వెంచర్ క్యాపిటర్ సంస్థ కలరి క్యాపిటల్ తాజా నివేదిక. ఏఐ, ఎంఎల్ (మెషిన్ లెర్నింగ్)కు సంబంధించి మన దేశంలో 84,000 మహిళలు పనిచేస్తున్నారని, 2027 నాటికి వారి సంఖ్య 3.4 లక్షలకు చేరవచ్చు అని అంచనా వేస్తోంది కలరి రిపోర్ట్.
ఏఐ ఎడ్యుకేషన్ మరింత ఎక్కువ మందికి అందుబాటులోకి రావడం, ఎక్కువగా అవకాశాలు అందుబాటులోకి రావడం... మొదలైన కారణాల వల్ల ఏఐ రంగంలో మహిళల సంఖ్య పెరుగుతుందని అంచనా వేసింది ఆ రిపోర్ట్. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పురుష ఉద్యోగుల కోసం మాత్రమే అన్నట్లుగా ఉండకూడదు. ఈ రంగంలో స్త్రీ, పురుషులకు సమాన అవకాశాలు ఉన్నప్పుడే వైవిధ్యం కనిపిస్తుంది. ఏఐ నిర్మాణంలో అందరి భాగస్వామ్యం ఉంటే పక్షపాతం కనిపించదు.
వైవిధ్యమైన, ప్రభావంతమైన ఏఐ భవిష్యత్ కోసం స్రీ, పురుషుల సమానభాగస్వామ్యం ఉండాలి’ అంటుంది ఒపెన్ఏఐ కంపెనీ పాలసీ అండ్ పాట్నర్షిప్స్ హెడ్ ప్రగ్యా మిశ్రా. ప్రపంచవ్యాప్తంగా స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం)కి సంబంధించి మన దేశంలో మహిళలు ముందంజలో ఉన్నారని నివేదిక పేర్కొంది.
అయితే కంప్యూటర్ సైన్స్, ఏఐలాంటి క్లిష్టమైన విభాగాలలో పరిస్థితి వేరే విధంగా ఉంది. ఐఐటీ విద్యార్థులలో మహిళలు 15 శాతం మంది మాత్రమే ఉన్నారు. స్టార్టప్ ప్రపంచంలో కూడా లింగ అంతరం స్పష్టంగా కనిపిస్తుంది. మన దేశంలోని ఏఐ స్టార్టప్లలో ఉమెన్ ఫౌండర్స్ పది శాతం మాత్రమే ఉన్నారు. దేశంలో అత్యధికంగా నిధులు సమకూర్చుకున్న 24 ఏఐ స్టారప్లలో ఏ ఒక్కదానిలో ఉమెన్ ఫౌండర్ లేరు.
అయితే, ఆశారేఖలాంటి విషయం ఏమిటంటే జనరేటివ్ ఏఐ కోర్సులలో మహిళల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. టెక్ రంగంలో యువతులకు ఏఐ, ఎంఎల్ టాప్ కెరీర్ ఆప్షన్గా మారింది. ‘మన దేశంలోని మహిళలు యూజర్ల స్థాయి నుండి ఏఐ రూపకర్తల స్థాయికి చేరుకోవడానికి ఎన్నో ద్వారాలు తెరవాలి. బాలికలకు పాఠశాల స్థాయి నుంచే ఏఐకి సంబంధించిన ప్రాథమిక జ్ఞానాన్ని అందించాలి. మహిళల నేతృత్వంలోని ఏఐ పరిశోధన సంస్థలు, స్టార్టప్లకు తగిన నిధులు సమకూర్చాలి’ అంటుంది మైక్రోసాఫ్ట్ సీనియర్ ప్రిన్సిపల్ రిసెర్చర్ కలిక బాలి.
(చదవండి: అందాల బొమ్మలం కాదు..! వివాదంలో మిస్ యూనివర్స్ పోటీ..)


