క్రైస్తవ్యం చెప్పే యుగాంతం | end of the age that Christianity says | Sakshi
Sakshi News home page

క్రైస్తవ్యం చెప్పే యుగాంతం

Jul 15 2024 10:52 AM | Updated on Jul 15 2024 11:33 AM

end of the age that Christianity says

పరిశుద్ధ గ్రంథంలో యుగాంతం గురించిన ప్రస్తావన విరివిగానే కనిపిస్తుంది. దీనిని యేసు ప్రభువు రెండవ రాకడ, ప్రభువు దినం, యుగసమాప్తి, కడవరి దినాలు, అంత్యకాలంగా పేర్కొనడం జరిగిందిప్రారంభంలో ఈ సృష్టిని చేసిన దేవుడు చివరిగా మానవులను సృజించాడు.

బైబిల్‌లో మొదటి గ్రంథమైన ఆదికాండంలో రాసి ఉన్నట్లుగా నరులు భూమ్మీద విస్తరించే సమయంలోనే మానవులపై దేవుడికి ఎంతో కోపం వచ్చినట్లుగా గమనిస్తాం. కారణం వారు దేవుని మార్గాన్ని విడిచారు. చీకటి మార్గాలు, సాతాను మార్గాలు వెదకడంప్రారంభించారు. నరుల చెడుతనం భూమిమీద బహుగా విస్తరించడం వారి హృదయ తలంపులు, ఊహలన్నీచెడ్డవిగా ఉండటం దేవుడు గమనించి, భూమి అంతా బలత్కారంతో నిండబడి ఉండటం దేవునికి సంతా΄ాన్ని కలుగజేసింది. ఫలితంగా నీతిమంతుడైన ఒక్క నోవహు కుటుంబాన్ని సకల పశుపక్ష్యాదులు, జంతువులను రెండేసి చొప్పున ఓ ప్రత్యేక ఓడ ద్వారా రక్షించి మిగతా మానవులందరినీ మహాజలప్రళయం ద్వారా నశింప చేసినట్లుగా చూస్తాం. నోవహు సంఘటన క్రీస్తుపూర్వం సుమారు 2,400 సంవత్సరాల క్రితం జరిగినట్లుగా బైబిల్‌ పండితులు చెబుతుంటారు. 

మరల భూమి మీద పాపం విస్తరించినప్పుడు రెండువేల సంవ్సరాల క్రితం దేవుడే యేసుక్రీస్తు రూపంలో నరరూపుధారుడై ఈ భూమ్మీదకి వచ్చాడు.. పాపుల రక్షణార్థమై సిలువమీద మరణించాడు. 3వ రోజున పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళాడు. యేసుక్రీస్తు తన బోధల్లో ఈ భూమి అంతం గురించి చాలా స్పష్టంగా తెలియ చేశాడు. త్వరలోనే యుగసమాప్తి ఉంటుందని పాపపు జీవితాన్ని వదిలివేసి దేవుని నమ్ముకొని మారుమనస్సు పోంది దేవుడిచ్చే ఉచిత రక్షణను స్వీకరించడం ద్వారా పరలోకానికి వారసులవుతారని, పాపులందరి కోసం నరకం సిద్ధంగా ఉందని  చెప్పాడు. యుగ సమాప్తి సమయంలో దీనిని యేసుక్రీస్తు మరల రెండవసారి భూమ్మీదకు వస్తాడు. ఆ తర్వాత అంతం ఉంటుంది. దీనిని యేసు ద్వితీయ ఆగమనంగా, క్రీస్తు రెండవ రాకడగా పిలుస్తారు. 

అయితే ఈ రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది? దానికి సూచనలేంటి అని శిష్యులు ఏసుప్రభువును అడిగినప్పుడు యుద్ధాలను గూర్చిన సమాచారం ఎక్కువగా వింటారని, జనాలమీదికి జనం, రాజ్యంమీదికి రాజ్యం లేస్తాయని, కరువులు, భూకంపాలు కలుగుతాయి. భూమ్మీద దేవుని బిడ్డలకు మహాశ్రమ వేదన కలుగుతుందని, మనుష్యుల్లో ఒకరిపట్ల ఒకరికి ద్వేషం పెరుగుతుందని, అక్రమం విస్తరించి మనుషుల్లో ప్రేమ చల్లారుతుందని, అలాగే యుగసమాప్తంలో సూర్యుడు వెలుగు ఇవ్వడని, చంద్రుడు కాంతి కోల్పోతాడని, ఆకాశం నుండి నక్షత్రాలు రాలతాయని, తుదకు క్రీస్తు మహా ప్రభావంతో భూమ్మీదకు వస్తాడని పేర్కొన్నాడు.

 అయితే ఆయన రాకడ అందరికీ తెలిసే విధంగా ఉండక అకస్మాత్తుగా దొంగ వచ్చినట్లు ఉంటుందని, అందుకే దేవుని భయం కలిగి పరిశుద్ధ జీవితం కలిగి జాగరూకతతో జీవించాలని యేసు చె΄్పాడు. అంత్యదినాలలో అ΄ాయకరమైన దినాలు వస్తాయని భక్తుడైన పాలు చెప్పాడు. మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, అబద్ధాలాడే వారు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రు లు, తల్లిదండ్రులను గౌరవించని వారు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా కోరేవారుగా ఉంటారని  భక్తుడు చెప్పాడు

అయితే యేçసు చెప్పిన రెండవ రాకడ గురుతులు చాలా ఇప్పటికే జరిగాయని, ప్రస్తుత సమాజం చూసినా అది బహిర్గతమౌతుందని, యేçసు రాకడ త్వరలో ఉందని దైవజనులు చెపుతున్నారు. ఏ దినమైనా ఏ సమయంలోనైనా ఈ యుగ సమాప్తి జరగవచ్చని, అందుకు సిద్ధంగా ఉండాలని బోధిస్తున్నారు. 
– బందెల స్టెర్జి రాజన్‌

అంత్యకాలంలో జరిగే విషయాలన్నీ బైబిల్‌లోని ప్రకటన గ్రంథంలో వివరంగా రాయబడ్డాయి. ఆయా కాలాలలో దేవుడు తన భక్తులకు భూమి అంతం గురించి తెలియజేస్తూనే ఉన్నాడు. అంతిమంగా ఈ భూమ్మీద జన్మించిన ప్రతిమనిషి దేవుని తీర్పును ఎదుర్కొంటాడని, దేవుని నమ్ముకున్నవారు, భూమ్మీద పాపం లేకుండా పవిత్రంగా జీవించిన వారు మాత్రమే దేవునితో సదాకాలం జీవించడానికి పరలోకానికి కొనిపోబడతారు. అక్రమంగా జీవించిన వాళ్ళంతా నిత్య నరకాగ్నిలో నిరంతరం వేదన అనుభవిస్తూ జీవిస్తారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement