
గచ్చిబౌలి: కొత్తగూడలోని శరత్సిటీ క్యాపిటల్ మాల్ లోని ఓ జ్యువెలరీ స్టోర్లో కొద్ది రోజులుగా గోల్డ్, సిల్వర్ బార్ చాలెంజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో టాలివుడ్ నటి ఈషా రెబ్బ (Eesha Rebba)సందడి చేశారు. నిత్యం సందర్శకులతో సందడిగా జరుగుతున్న ఈ చాలెంజ్లో ఈషా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈషా మాట్లాడుతూ బంగారం లాంటి వేడుక నిర్వహించారని, ఇలాంటి వినూత్న కార్యక్రమాలు మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తాయని అన్నారు. గోల్డ్–సిల్వర్ బార్ చాలెంజ్ ఈవెంట్లో పాల్గొని సందర్శకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. గెలుపొందిన వారికి బంగారు, వెండి నాణేలు బహుమతిగా అందజేశారు.
రజతాభరణాల్లో మోడల్స్ తళుకులు- వెండి వెలుగులు
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.9లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ జ్యువెలరీ హబ్లో మోడల్స్ వెండి ఆభరణాలను ధరించి హొయలు పోయారు. బంగారం ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో నగర ప్రజలు సిల్వర్ జ్యువెలరీపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. దీంతో సిల్వర్ ఆభరణాలకు డిమాండ్ పెరుగుతుందని ఈ సందర్భంగా ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుత తరుణంలో సిల్వర్ జ్యువెలరీతో పాటు గృహాలంకరణలోనూ వెండితో చేసిన వస్తువులు వినియోగిస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. హైదరాబాదీ మోడళ్లు అబ్బురపరిచే వెండి కళాకృతులు.. క్రాఫ్టెడ్ జ్యువెలరీని ప్రదర్శించారు. ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్తో అందాల ముద్దుగుమ్మలు వెండి వెలుగులు నింపారు. 100 ఏళ్ల తమ వారసత్వానికి ఈ షోరూమ్ మళ్ళీ మద్దతు ఇచ్చే ఒక అద్భుత అవకాశమని, గచ్చిబౌలిలోని తమ హబ్, బషీర్బాగ్లోని జ్యువెలర్స్ వలే నాణ్యతకు, సంప్రదాయ డిజైన్లకు, ఆధునికతకు నిలువెత్తు ఉదాహరణ అని నిర్వాహకులు చెబుతున్నారు. ‘ప్రతి వెండి కళాకృతి నగర సంస్కృతిని ప్రతిబింబిస్తుందని, సంప్రదాయ రూపకల్పన నుంచి ఆధునిక డిజైన్లకు వేదికగా నిలుస్తుందని వివరించారు.
నీల మేఘ శ్యామనృత్య రూపకం గురు శ్రవ్య మానస ఆధ్వర్యంలో నిర్వహణ
మోతీనగర్: ప్రముఖ కూచిపూడి నృత్యకళా సంస్థ సుమధుర ఆర్ట్స్ అకాడమీ సమర్పణలో గురు శ్రవ్య మానస ఆధ్వర్యంలో సంస్థ నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవాలు ఆదివారం నిర్వహించారు. ఇందులో భాగంగా ‘నీల మేఘ శ్యామ’ నృత్య రూపకాన్ని విద్యార్థులు ప్రదర్శించారు. సుమారు 200 మంది నృత్య కళాకారులు పాల్గొని అహూతులను అలరించారు. వీక్షకుల సమక్షంలో జనరంజకంగా నిర్వహించిన ప్రదర్శనలో కృష్ణ భగవానుని లీలామృతంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ప్రధానంగా చేసుకొని గురు శ్రవ్య మానస భోగిరెడ్డి తన శిష్య బృందంతో అద్భుతంగా రూపకల్పన చేశారు. కూచిపూడి విద్యార్థులందరూ చక్కని హావభావాలతో విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా రవికుమార్ దూళిపాట, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, సినీ నటులు, శ్రీనివాస భోగిరెడ్డి ప్రదర్శనకు ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపారు. ఈ కార్యక్రమాన్ని శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జి. కిషన్రావు, ఐఏఎస్, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ మేనేజింగ్ డైరెక్టర్ కె.లక్ష్మీ, ఐఏఎస్లు, ప్రముఖ సినీ, టీవీ దర్శక, నిర్మాతలు పాల్గొన్నారు.