
(ఈ ఫొటోలో ఉన్నది రావణుడు. దసరాకి రావణ దహనం చేస్తారు. అందుకు తయారవుతున్న బొమ్మ ఇది. ఢిల్లీలోనిది ఈ ఫొటో)
పిల్లలూ... దేవీ నవరాత్రులను దసరా పండగగా పిలుస్తారు. పూర్వపు రోజుల్లో దసరా సెలవలప్పుడు ఉపాధ్యాయులు తమ తమ పాఠశాలలో చదువుకునే బాల బాలికలను వెంటబెట్టుకుని గ్రామం లోని ఇంటింటికీ వెళ్ళే వారు, గహస్తులను ఆశీర్వదంచేవాళ్ళు. పిల్లలు కొత్త బట్టలు వేసుకుని చేతుల్లో విల్లంబులు పట్టుకుని అయ్యవారి వెంట వెళ్ళే వారు. ఈ అంబులను గిలకలు అంటారు. వీటిని సంధించి వదిలితే, ఎదుటి వారి మీద పూలూ ఆకులు పడేవి. బడి పిల్లలు అలా ఊరంతా తిరుగుతూ పాటలు, పద్యాలు పాడేవారు. వీటినే దసరా పద్యాలు అంటారు. దసరా పద్యాలు చాలా సులభంగా, వీనులకు విందుగా ఉంటాయి. ఈ పద్యం చూడండి.
ఏ దయా మీ దయా మా మీద లేదు,
ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు,
దసరాకు వస్తిమనీ విసవిసలు పడక
చేతిలో లేదనక అప్పివ్వరనక
పావలా.. .అర్ధయితే ...పట్టేది లేదు,
ముప్పావలా అయితే ముట్టేది లేదు,
హెచ్చు రూపాయయితే పుచ్చుకుంటాము,
అయ్య వారికి చాలు ఐదు వరహాలు
పిల్ల వారికి చాలు పప్పు బెల్లాలు
జయీభవా...దిగ్విజయీభవా