విజయవాడ గొల్లపూడికి చెందిన 35 సంవత్సరాల చందు ఉదయాన్నే నిద్రలేవగానే ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని తొలుత సమీపంలోని ఆస్పత్రికి, అనంతరం విజయవాడలోని గుండె ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
విజయవాడ లబ్బీపేటకు చెందిన రమేష్ వయసు 40 సంవత్సరాలు. ఇటీవల వేకువ జామున 4 గంటలకు ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పాడు. గ్యాస్ నొప్పిగా భావించి ఒక మాత్ర వేసుకుని పడుకున్నాడు. మళ్లీ 6 గంటలకు ఛాతీలో పెయిన్ ప్రారంభమైంది. దీంతో తమ ఇంటికి 300 మీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ గుండె వైద్యుడు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు.
ఇలా వీరిద్దరే కాదు.. గుండెపోటుతో ఆకస్మికంగా మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. వాకింగ్ చేస్తూ... క్లాస్రూమ్ లో పాఠాలు వింటూ... కుప్పకూలి మరణిస్తున్న వారిని నిత్యం చూస్తున్నాం. ప్రస్తుతం అతిపెద్ద కిల్లర్గా గుండెపోటు మారిందని వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ పేర్కొంది. గుండెపోటు మరణాలను నివారించాలంటే ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. జీవనశైలిని మార్పు చేసుకోవడంతో పాటు, ముందస్తు నిర్ధారణ పరీక్షల ద్వారా గుండెపోటు మరణాలను నివారించవచ్చునని వైద్యులు అంటున్నారు. ఉరుకుల పరుగుల జీవనంలో వత్తిడిని తగ్గించుకోవడం కూడా చాలా అవసరం అంటున్నారు.
గుండెపోటుకు కారణాలివే...
∙ వయస్సు రీత్యా వచ్చే గుండెపోటు, ఇవి 45 ఏళ్లు నిండిన వారికి వస్తుంటాయి.
∙ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న వారు 40 ఏళ్ల లోపు గుండె పోటుకు గురవుతున్నారు. అందుకు కారణాలిలా ఉన్నాయి.
∙ ఫ్యామిలీ(తల్లి, తండ్రి) గుండెపోటుకు గురైన వారు ఉండటం
∙ స్మోకింగ్ చేయడం
∙ కోవిడ్ ప్రభావం
∙ పుట్టుకతోనే కొన్ని రకాల జన్యుపరమైన లోపాలు ఉండటం
∙ ప్రొటీన్ డెఫిషియన్సీ
∙ జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అధిక కొలస్ట్రాల్, ఒబెసిటీ రావడం
ముందస్తుగా ఏమి చేయాలి...
∙ ప్రతి ఒక్కరూ 40 ఏళ్లు దాటిన తర్వాత సీటీ యాంజియో చేయించుకోవడం ద్వారా గుండె రక్తనాళాల్లోని బ్లాక్లను గుర్తించవచ్చు.
∙ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న వారు వయస్సుతో సంబంధం లేకుండా వైద్యుల సూచన మేరకు సీటీ యాంజియో చేయించుకోవాలి
∙ రక్తపోటు, మధుమేహం ఉన్న వారు వాటిని అదుపులో ఉంచుకుంటూ, కొల్రస్టాల్ మందులు రెగ్యులర్గా వాడాలి.
వ్యక్తిగత జాగ్రత్తలు
∙ వత్తిడిని తగ్గించుకోవాలి. మంచి నిద్రపోవాలి
∙ స్మోకింగ్ అలవాటు ఉంటే మానుకోవాలి
∙ ఆహారపు అలవాట్లను మార్పుకోవాలి
∙ నాన్ వెజ్ వంటకాలు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది
∙ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి
మధుమేహమూ కారణమే...
మధుమేహం అదుపులో లేని వారు గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది. మెదడు, పాదాలకు రక్త ప్రసరణ సరిగా లేని శరీర తత్వం ఉన్న వారిలో గుండె రక్తప్రసరణలోనూ లోపాలు తలెత్తే అవకాశం ఉంది. అలాంటి వారు గుండె, మధుమేహ పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండటం, క్రమం తప్పకుండా మందులు వాడటం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చు. సమతుల ఆహారం, క్రమం తప్పని వ్యాయామంతో పాటు, అధిక రక్తపోటు, కొలస్ట్రాల్లను మెరుగ్గా నియంత్రించుకోవాలి.
వాకింగ్తో బ్లాక్స్కు చెక్
ప్రతిరోజూ 45 నిమిషాల పాటు వాకింగ్ చేయడం ద్వారా రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడకుండా చూడవచ్చునని వైద్యులు చెపుతున్నారు. వాకింగ్ చేసే వారిలో రక్తనాళాల్లోని కొల్రస్టాల్ బ్లాక్స్ పెరిగే అవకాశం ఉండదంటున్నారు. ముఖ్యంగా మధుమేహుల్లో రక్తనాళాలు సన్నబడి రక్త ప్రసరణకు అవరోధం ఏర్పడుతుందని, వాకింగ్ చేస్తే అలాంటి సమస్యలు రావంటున్నారు. మొత్తంగా రోజుకు 45 నిమిషాల చొప్పున వారంలో 5 రోజులు వాకింగ్ చేస్తే రక్తనాళాల్లో బ్లాక్స్ రాకుండా చూడటంతో పాటు, గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గించుకోవచ్చునంటున్నారు.

ముందస్తు పరీక్షలతో మేలు
40 ఏళ్లు నిండిన వారు గుండె రక్తనాళాల్లోని బ్లాక్స్ను నిర్ధారించేందుకు సీటీ యాంజియో చేయించుకుంటే మంచిది. ఆరోగ్యకర జీవన విధానం, వత్తిళ్లను తగ్గించుకోవడం, ఆహార నియమాలు పాటించడం, రెగ్యులర్గా వాకింగ్ చేయడం ద్వారా గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు. స్మోకింగ్ చేసే వారిలో, కోవిడ్ ప్రభావం ఉన్న వారిలో చిన్న వయస్సులోనే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.
– డాక్టర్ కృష్ణచంద్ కాగిత, కార్డియాలజిస్ట్,సెంటినీ, విజయవాడ


