Bridgeman Girish Bharadwaj Built 127 Bridges - Sakshi
Sakshi News home page

ఒక్క రూపాయి తీసుకోకుండా.. వందల కొద్ది బ్రిడ్జ్‌లను నిర్మించాడు!

Published Mon, Jul 3 2023 3:15 PM

Bridgeman' Girish Bharadwaj  Built 127 Bridges - Sakshi

ఎన్నో మారు మూల ప్రాంతాలను నగరాలతో అనుసంధానమయ్యేలా చేశాడు. స్కూళ్లకు, ఆస్పత్రులకు వెళ్లేందుకు ఇబ్బంది ఉండే మారూమూల ప్రాంతాలకు అతను వారధిగా నిలిచాడు. వందలకొద్ది వంతెనలను అలవోకగా నిర్మించాడు. ఒక్క రూపాయి ఆశించకుండా, ఎలాంటి సాయం తీసుకోకుండా ఉచితంగా నిర్మించాడు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. ఆ సమాజా సేవ అతనికి ఎన్నో అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టాయి. అతడే బ్రిడ్జ్‌మ్యాన్‌గా పిలిచే గిరీష్‌ భరద్వాజ్‌

భరద్వాజ్‌ కర్ణాటకకు చెందిన ఇంజనీర్‌. నదులు, వాగుల వద్ద ఉండే మారుమూల గ్రామాలను నగరాలతో కనెక్టవిటీ అయ్యేందుకు ఎంతగానో కృషి చేశాడు. ఆయా గ్రామాల్లో ఉండే విద్యార్థులు, ప్రజలు సీటీకి వెళ్లాలంటే వాగులు, వంకలు దాటేల్సింది. నిత్యం వారికది సాహస క్రీడగా మారింది. దీన్ని చూసి చలించిపోయిన భరద్వాజ్‌ ఆయా ప్రాంతాల్లో బ్రిడ్జ్‌లు నిర్మిస్తే వారి సమస్య తీరుతుందని భావించి ప్రభుత్వాన్ని ఆశ్రయించగా.. సాయం చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆయనే స్వయంగా నిర్మించేందుకు పూనుకోవాలనే ధృఢ నిశ్చయానికి వచ్చాడు. అందుకోసం తక్కువ ఖర్చుతో నిర్మించి బ్రిడ్జిల కోసం అన్వేషించాడు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం స్టీల్‌ కేబుల్స్‌ ఎంచుకుని వేలాడే బ్రిడ్జ్‌లను నిర్మించాలనే ఓ నిర్ణయానికి వచ్చాడు.

అలా మొత్తం వివిధ ప్రాంతాల్లో సుమారు 128 బ్రిడ్జ్‌లు అలవోకగా నిర్మించాడు. మొదటగా కావేరి నదిపై కుశాల్‌నగర్ సమీపంలోని నిసర్గధామ ద్వీపాన్ని కర్ణాటక ప్రధాన భూభాగన్ని కలిపేలా 55 మీటర్ల బ్రిడ్జ్‌తో అతని ప్రయాణం ప్రారంభమైంది. అలా అతను తక్కువ ఖర్చుతో బ్రిడ్జ్‌లు నిర్మించిన వ్యక్తిగా ఘనత సాధించడమే గాక ఇలా ఎన్నో మారుమూల ప్రాంతాలను నగరాలతో కనెక్ట్‌ అయ్యేలా చేసి 'బ్రిడ్జ్‌మ్యాన్‌ ఆప్‌ ఇండియాగా పేరుగాంచాడు. ఆయన చేసిన కృషికిగానూ భారత ప్రభుత్వం పద్శశ్రీతో సత్కరించింది.

భరద్వాజ్‌ ఓ కార్యక్రమంలో మట్లాడుతూ..నేను చాలా విస్తృతంగా పనిచేశాను. దురదృష్టమేమిటంటే ప్రతిభావంతులైన చాలా మంది గుర్తించబడటం లేదు. 1980 దశకంలో మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. జీవితంలో క్రూరంగా మారిన ఏ వ్యక్తినైనా ప్రేమ, ఆప్యాయతతో తిరిగి సమాజంలోని జనజీవన స్రవంతిలోకి తీసుకురావచ్చు. అందుకు కావల్సిందల్లా మానవత్వం, ప్రేమ ఉంటే చాలని చెప్పారు.  ఇక ఆయన జీవితం ఆధారంగా కన్నడ నిర్మాత సంతోష్ కోడెంకేరి ది బ్రిడ్జ్‌మ్యాన్ అనే బయోపిక్‌ను రూపొందిస్తున్నారు.  దీనిని కన్నడలో నిర్మించి హిందీలో కూడా విడుదల చేయనుండటం గమనార్హం.

(చదవండి: 20 కుటుంబాలు ఇళ్ళు హామీ పెట్టి.. బ్యాంకు రుణం తెచ్చి కట్టిన గుడి !)

Advertisement
Advertisement