జాతీ మతం కంటే మనిషి ముఖ్యం | Boong film director Lakshmi Priyadevi saves Gugun family | Sakshi
Sakshi News home page

జాతీ మతం కంటే మనిషి ముఖ్యం

Feb 25 2026 12:56 AM | Updated on Feb 25 2026 12:57 AM

Boong film director Lakshmi Priyadevi saves Gugun family

బ్రిటిష్‌ అకాడెమీ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ చిత్రం ‘బూంగ్‌’ తెర వెనుక కథ మానవత్వాన్ని చాటుతోంది. ఈ సినిమా దర్శకురాలు లక్ష్మీ ప్రియాదేవి మణిపూర్‌లో మెయితి తెగకు చెందినామె. ముఖ్య పాత్ర పోషించిన బాలనటుడు గుగున్‌ కుకీ తెగకు చెందినవాడు. అయితే సినిమాలో అతను మెయితీ తెగకు చెందిన పిల్లాడిగా నటించాడు. సినిమా షూట్‌ ముగిశాక మొదలైన మణిపూర్‌ అల్లర్లలో మెయితీల దాడి నుంచి గుగున్‌ కుటుంబాన్నిలక్ష్మీ ప్రియాదేవి కాపాడింది. ఢిల్లీకి వలస వచ్చిన గుగున్‌ ప్రస్తుతం ఆరవ తరగతి పరీక్షలకు కూచుంటున్నాడు. 2023కు ముందు మతం, జాతీ తేడా లేకుండా ఉన్న తాము ఇప్పుడెందుకు ఇలా ఉన్నామని ప్రశ్నిస్తున్నారు వారు.

మణిపురి భాషలో తీసిన ‘బూంగ్‌’ సినిమా ట్రైలర్‌ను చూసినా అది మనల్ని ఆకట్టుకుంటుంది. అందులో కనిపించే తల్లీకొడుకులు మనకు ఏదో లోతైన కథ చెప్తున్నారనిపిస్తుంది. ఆ సినిమాలో తండ్రి ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లి ఉంటాడు. స్కూల్‌ చదువులో ఉన్న కుమారుడు తండ్రి కోసం బయల్దేరడమే ‘బూంగ్‌’ సినిమా. మణిపురి దర్శకురాలు లక్ష్మీ ప్రియాదేవి దర్శకత్వం వహించిన ఈ సినిమా ‘బ్రిటిష్‌ అకాడెమీ’ అవార్డ్స్‌లో మొదటిసారి మన దేశానికి అవార్డు సం పాదించిపెట్టింది. ఇది రికార్డు. ఈ కథ ఇక్కడ ముగిసినా ఈ సినిమా వెనుక ఉన్న కథ మాత్రం మనసుల్ని కదిలించేలా ఉంది.

మెయితీ–కుకీ
మణిపూర్‌లో రెండు బలమైన జాతులు ఉన్నాయి. మెయితీ– కుకీ. ఇంఫాల్‌ లోయలో మెయితీలది పై చేయి అయితే కొండ ప్రాంతాలలో కుకీలది పై చేయి. లక్ష్మీ ప్రియాదేవి తీసిన ‘బూంగ్‌’ సినిమాలో కథ మెయితీ కుటుంబానిది. అయితే అందుకు కావలసిన బాల నటుడు కుకీ కుటుంబం నుంచి దొరికాడు. అతని పేరే గుగున్‌ కిప్జెన్‌. 2023లో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు కిప్జెన్‌కు 11 ఏళ్లు. సినిమా షూటింగ్‌ ముగిశాక మే 3, 2023న హటాత్తుగా మణిపూర్‌లో అల్లర్లు మొదలయ్యాయి. మెయితీలు పైచేయిగా ఉండే ఇంఫాల్‌లో కుకీల మీద దాడులు జరుగుతున్నాయి.

అప్పుడు కిప్జెన్‌ కుటుంబం ఇంఫాల్‌లోని కానన్‌వెంగ్‌ అనే ప్రాంతంలో ఉంది. మే4న మెయితీలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఆ సమయంలో స్వయంగా మెయితీ తెగకు చెందిన లక్ష్మీ ప్రియాదేవి రంగంలో దిగి కిప్జెన్‌ కుటుంబాన్ని ఆ ప్రాంతం నుంచి దాటించింది. కిప్జెన్‌ కుటుంబం  పోట్ట చేత్తో పట్టుకుని అస్సాం రైఫిల్స్‌ శిబిరానికి చేరి తల దాచుకుంది. అక్కడ కొన్నాళ్లు ఉన్నాక కుకీలు ఎక్కువ ఉండే కాంగ్‌ పోక్‌పి జిల్లాకు తరలి వెళ్లింది.

ఇంఫాల్‌లో ఉన్న సొంత ఇంటిని కిప్జెన్‌ వదిలి పెట్టేశాడు. అతని స్కూల్‌లో అతను తిరిగి చదవలేడు. ఏ మెయితీ పిల్లాడి  పాత్ర తాను పోషించాడు ఆ మెయితీల వల్లే కష్టాల్లోకి వెళ్లిపోయాడు. ఇతనిలాగే కుకీల వల్ల మెయితీ కుటుంబాలు, పిల్లలు అవస్థ పడ్డాయి. ఇరు వర్గాల ఘర్షణల్లో పై పై లెక్కల ప్రకారం 260 మంది చనిపోతే 50 వేల మంది నిరాశ్రయులు అయ్యారు.

ఢిల్లీకి చేరి...
కొండ ప్రాంతానికి చేరినా కిప్జెన్‌ కుటుంబం సురక్షితంగా లేదు. అల్లర్లు కొనసాగుతూనే వచ్చాయి. దాంతో కిప్జెన్‌ చదువు కోసం కుటుంబం ఢిల్లీకి వలస వెళ్లాలనుకుంది. అదీ అంత సులభంగా జరగలేదు. మిలటరీ కాన్వాయ్‌లో ఒక బస్సులో కొన్ని కుటుంబాలతో  పాటు ప్రాణాలు అరచేత పెట్టుకుని ఢిల్లీకి చేరారు. 2025 జనవరి నుంచి కిప్జెన్‌ కుటుంబం ఢిల్లీలోనే ఉంది. మణిపూర్‌లో అల్లర్లు పూర్తిగా తగ్గితే తప్ప వెనక్కు వెళ్లమని చెబుతోంది. కొత్త వాతావరణంలో కిప్జెన్‌ బడి బాట పట్టాడు. ప్రస్తుతం 6వ తరగతి పరీక్షకు కూచుంటున్నాడు. అతడు నటించిన సినిమా దేశ దేశాల్లో ఎంతో పేరు సం పాదిస్తున్నా ఆ సంతోషం అంతా అనుభవించలేకపోతున్నాడు. వలస జీవితం ఎంత దుర్భరమో అనుభవించినవారికే తెలుసు.

దివ్యశక్తి ప్రతిఒక్కరిలో...
బ్రిటిష్‌ అకాడెమీ అవార్డు  పోందాక లక్ష్మీ ప్రియా దేవి తన ఉపన్యాసం ఇలా చేసింది– ‘మేమంతా ఎంతో బాగుండేవాళ్లం. ఆ మునుపటి శాంతి మణిపూర్‌కి తిరిగి రావాలి. చెదిరిపోయిన పిల్లలంతా తిరిగి తమ గూళ్లకు చేరుకుని ఆనందంగా గడ పాలి. ఎన్ని ఘర్షణలు జరిగినా మనిషిలో క్షమ అనే దివ్యశక్తి మనిషికి మాత్రమే సొంతం. ఆ క్షమతో మానవత్వాన్ని నిలబెట్టాలి’ అందామె. దేశంలో అందరికీ గౌరవంగా, సమానంగా బతికే హక్కు ఉంది. ఎవరికంటే ఎవరూ ఎక్కువ కాదు... తక్కువ కాదు. దాడులు, ప్రతి దాడులు, ద్వేషాలు పిల్లల భవిష్యత్తుకు ఎంతమాత్రం మంచివి కావు. మానవత్వమే మనిషి ప్రథమ గుణం కావాలి... ఇదే ఇప్పుడు ‘బూంగ్‌’ సినిమా విజేతలు లోకానికి ఇస్తున్న సందేశం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement