ఒక్క అందాల నటి నిధి అగర్వాల్ని చూస్తేనే కళ్లు అప్పగించేస్తాం.. అలాంటిది ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఒకేసారి అరడజను మంది నిధి అగర్వాల్లను చూస్తే.. కళ్లు బైర్లు కమ్మడమే తరువాయి కదా..! ఇలాంటి అద్భుతం ఒక్కటేనా..? అంటే కాదు! నేల మీద నడుస్తున్నా చుట్టూ రంగు రంగుల నీళ్ల ప్రవాహంలో తేలిపోతున్నట్టు, గాంధీ తాత ఫొటోలోని కళ్లు ఆర్పి తెరుస్తున్నట్టు.. వగైరా వింతైన అనుభవాలు, జీరో గ్రావిటీ రూమ్, ఇన్ఫినిటీ వెల్, పారడాక్స్ టన్నెల్, పారడాక్స్ సోఫా, వాకింగ్ కెలిడియోస్కోప్లతో కూడిన పారడాక్స్ మ్యూజియం భాగ్యనగరంలో ఏర్పాటైంది.
యూరప్కు చెందిన మిల్టోస్, కంబౌరిడెస్ సాకిస్ టానిమానిడిస్ ఆధ్వర్యంలో సోమాజిగూడలోని ప్రణవ వన్లో నెలకొల్పిన ఈ పారడాక్స్ మ్యూజియంను ప్రముఖ టాలీవుడ్ సినీ నటి నిథి అగర్వాల్ సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మ్యూజియం నిర్వాహకులు మాట్లాడుతూ ఆప్టికల్ ఇల్యూజన్ల మిశ్రమమైన ఈ మ్యూజియం విజ్ఞాన, వినోదాల మేళవింపుగా పేర్కొన్నారు. 2022 నుంచి ఒస్లో, లండన్, పారిస్, మియామి, స్టాక్హోమ్, బెర్లిన్, షాంఘై, బార్సిలోనా, ముంబై వంటి నగరాల్లో వీటిని వరుసగా ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.


