బుట్టాయగూడెం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం నిర్మించిన పునరావాస గృహాల్లో మౌలిక వసతులు కల్పించి నిర్వాసితులను తరలించేలా చర్యలు తీసుకుంటున్నట్టు గృహ నిర్మాణశాఖ పీడీ సత్యనారాయణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె.ఆంజనేయులు, బాలకృష్ణారెడ్డి తెలిపారు. మండలంలోని దొరమామిడిలో నిర్వాసితుల కోసం నిర్మించిన పునరావాస గృహాలను చింతూరు డివిజన్ పరిధిలోని వీఆర్ పురం మండలం శబరిరాయిగూడెం గ్రామ నిర్వాసితులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దొరమామిడి సమీపంలో సుమారు 57 ఎకరాల్లో పునరావాస కాలనీలు నిర్మించామన్నారు. ఇప్పటికే కొయిదా ప్రాంతం నుంచి నిర్వాసితులు తరలివచ్చి నివాసం ఉంటున్నారని చెప్పారు. అయితే శబరిరాయిగూడేనికి చెందిన వారికి కూడా ఇళ్లు కేటాయించేలా ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే కాలనీలను సందర్శించిన నిర్వాసితులు ఇక్కడ ఉండేందుకు అంగీకరించారన్నారు. కాలనీ సమీపంలో ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మించి మెయిన్ రహదారికి అప్రోచ్ రోడ్డు ఇవ్వాలని నిర్వాసితులు కోరారని, ఈ మేరకు కృషి చేస్తున్నామన్నారు. ఒకే కుటుంబానికి చెందిన కుటుంబసభ్యులు పక్కపక్కనే ఉండేలా కేటాయించాలని కోరారని, అలాగే ఇంటికి కేటాయించిన ఐదు సెంట్ల స్థలంలో హద్దులు చూపించాలని కోరారని అవన్నీ కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామన్నారు. తహసీల్దార్ డి.ప్రమద్వర, డిప్యూటీ ఎంపీడీఓ ఈఎస్ఎస్ శ్రీనివాస్, హౌసింగ్ ఈఈ ప్రసాద్, ఎస్సై చెన్నారావు, ఆర్ఐ కె.గంగరాజు, కార్యదర్శులు రామకృష్ణ, కిరణ్, బి.రవికిషోర్ పాల్గొన్నారు.


