ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు శాసీ్త్రయ అధ్యయనాల ఆధారంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్పై జిల్లాస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో గాలి నాణ్యతపై నిర్వహించిన శాసీ్త్రయ అధ్యయనాలు వివరాలను పరిశీలించి, కాలుష్యానికి ప్రధాన కారణాలు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించారు. జిల్లాలో కాలుష్య హాట్స్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నియంత్రణకు నిర్దిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. ఓవర్లోడ్ వాహనాలపై సీసీ కెమెరాలతో నిఘా పెట్టాలని, ఇసుక, ఇతర సరుకు రవాణా వాహనాల రాకపోకలు కారణంగా కొన్ని ప్రాంతాల్లో దుమ్ము, వాయు కాలుష్యం ఏర్పడుతున్న అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చర్యలు తప్పవన్నారు. ఈ–ఆటోలు, సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. డీజిల్ ఆటోలను సీఎన్జీ వాహనాలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి, ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించాలన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఎ.భానుప్రతాప్, ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ ఎ.రామచంద్రమూర్తి, జిల్లా రోడ్డు ట్రాన్స్పోర్టు అధికారి ఎస్బీ శేఖర్, సీపీసీబీ కన్సల్టెంట్ ఎ.కోమలి, అధికారులు పాల్గొన్నారు.


