ఏలూరు టౌన్: సేవా సంకల్ప్ అభియాన్–26లో భా గంగా వచ్చేనెల 17 వరకు నెలరోజులపాటు జిల్లాలో వైద్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని డీఎంహెచ్ఓ డాక్టర్ యు.శోభ తెలిపారు. వైద్య శిబిరాల్లో ఉచిత ఆరోగ్య పరీక్షలు, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ పరీక్షలు, వైద్యుల సలహాలు, రిఫరల్ సేవలు, మందుల పంపిణీ చేస్తామన్నారు. మరోవైపు టీకాలు, వ్యాధుల నివారణ, తల్లిశిశు ఆరోగ్యం, పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత–పారిశుధ్యం, మానసిక ఆరోగ్యం, టెలీ మానస్ సేవలు, ఉప్పు, ఆయిల్ తక్కువ మోతాదులో వినియోగించటం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, కమ్యూనిటీ నాయకుల భాగస్వామ్యంతో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. శిబిరాలకు హాజరయ్యే వారి సమాచారం ఆన్లైన్లో నమోదు, రికార్డుల నిర్వహణ చేపట్టాలని రాష్ట్రస్థాయి మార్గదర్శకాల్లో పేర్కొన్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్య సేవలు పొందాలని ఆమె సూచించారు.


