గణపవరం: గణపవరం– ఆకివీడు రహదారిలోని చాణక్య కాలేజీ మలుపు వద్ద శుక్రవారం రాత్రి చేపల లోడుతో వెళ్తున్న లారీ రోడ్డు పక్కన ఉన్న కల్వర్టు మార్జిన్లోకి దిగబడింది. లారీ ప్రక్కకు ఒరిగిపోతుండటాన్ని గమనించిన పైనున్న సుమారు 15 మంది ప్యాకింగ్ కూలీలు, డ్రైవర్, క్లీనర్ వెంటనే కిందకు దూకేయడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. లారీ పక్కనే ఉన్న చెరువులోకి బోల్తా పడకుండా రెండు జేసీబీలను రప్పించి, వాటి సాయంతో లారీ ఆపారు. అనంతరం లారీలోని చేపల ట్రేలను వేరొక వాహనంలోకి మార్చారు. ఈ ఘటన వల్ల దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ద్విచక్ర వాహనదారులు, సైక్లిస్టులు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లగా, కార్లు, ఇతర భారీ వాహనాలు లారీని తొలగించే వరకు నిలిచిపోయాయి.


