గడువులోపు లైసెన్సు రెన్యువల్‌ చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

గడువులోపు లైసెన్సు రెన్యువల్‌ చేసుకోవాలి

Sep 19 2026 12:52 AM | Updated on Sep 19 2026 12:52 AM

గడువులోపు లైసెన్సు రెన్యువల్‌ చేసుకోవాలి ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీలు అవయవ దానంతో ఐదుగురికి పునర్జన్మ గుండుగొలను ఆలయంలో ఆభరణాల తనిఖీ రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

భీమవరం : మద్యం దుకాణాలను మరో ఏడాది పాటు నిర్వహించుకునేలా ప్రభుత్వం అనుమతినిచ్చిందని ఎకై ్సజ్‌ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ బి.శ్రీలత తెలిపారు. భీమవరంలోని ఆబ్కారీ కార్యాలయంలో లైసెన్సుదారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమే మాట్లాడారు. నిబంధనల ప్రకారం గడువులోగా లైసెన్సులను రెన్యూవల్‌ చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని 193 దుకాణాలకు గాను ఇప్పటివరకు 51 దుకాణాల నిర్వాహకులు పూర్తి రుసుము, 41 మంది పాక్షికంగా చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు. సమావేశంలో ఎకై ్సజ్‌ అధికారులు బి.సుబ్బారావు, కేవీఎన్‌ ప్రభుకుమార్‌, సీఐలు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం: ఐపీఎం డైరెక్టర్‌, జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్ల ఆదేశాల మేరకు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు శుక్రవారం తాడేపల్లిగూడెం, తణుకుల్లోని డీమార్ట్‌లు, మిల్క్‌ సెంటర్లలో తనిఖీలు చేపట్టారు. మిల్క్‌ సెంటర్లలోని పనీర్‌లో వెజిటబుల్‌ ఆయిల్‌, పిండి పదార్థాలు కలుపుతున్నారనే అనుమానంతో నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపారు. అలాగే తణుకులోని కేఎఫ్‌సీలో వాడుతున్న నూనె నాణ్యతను పరీక్షించారు. ఇందులో టీపీసీ రీడింగ్‌ 25 ఉండాల్సి ఉండగా, ఏకంగా 38 ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ ఏఎస్‌ఆర్‌ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

లక్డీకాపూల్‌: తణుకుకు చెందిన ఒక సాధారణ రైతు కుటుంబం ఉదాత్తత చాటుకుంది. బ్రెయిన్‌ డెడ్‌ అయిన రైతు మద్దిపాటి హనుమంతరావు (58) అవయవాలను దానం చేసి ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. తీవ్ర నరాల సమస్యతో బాధపడుతున్న ఆయనకు ఈ నెల 14న శస్త్రచికిత్స జరిగింది. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స ఫలించక గురువారం ఆయన బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆ పుట్టెడు దుఃఖంలోనూ హనుమంతరావు భార్య సువర్చల, కుమారుడు లలిత శంకర్‌ ధైర్యంతో అవయవదానానికి ముందుకొచ్చారు. దీంతో ఆయన శరీరం నుంచి రెండు మూత్రపిండాలు, కాలేయం, రెండు నేత్రాలను సేకరించారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ శ్రీవన్‌దాన్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ శ్రీభూషణ్‌రాజు అభినందించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 148 బ్రెయిన్‌ డెడ్‌ అవయవ దానాలు నమోదైనట్లు ఆయన తెలిపారు.

భీమడోలు: దేవదాయ శాఖ పరిధిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని శుక్రవారం జిల్లా అసిస్టెంట్‌ అధికారి, జ్యువెలరీ వెరిఫికేషన్‌ అధికారి పల్లంరాజు సందర్శించారు. ఆలయంలోని స్వామివారి బంగారు, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను నిబంధనల ప్రకారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ కిషోర్‌, మాజీ ఆలయ కమిటీ అధ్యక్షురాలు మీనాకుమారి, మాధవి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

బుట్టాయగూడెం: మండలా పరిధిలోని బూసరాజుపల్లి సమీపంలో శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఆర్‌టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని 108 వాహనంలో జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో తీవ్రమైన మలుపులు ఉండటం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement