తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని ఎల్.అగ్రహారం టిడ్కో గృహసముదాయంలో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. రూరల్ ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం పెదవేగి మండలం ముండూరుకు చెందిన యాదాల మంగ (28) రెండేళ్ల క్రితం భర్తను వదిలేసి, ఎల్.అగ్రహారం టిడ్కో కాంప్లెక్స్లో పరిచయస్తురాలైన విజయకుమారి ఇంట్లో నివాసముంటోంది. ఈమెకు ముండూరుకే చెందిన గెడ్డం సందీప్ అలియాస్ సన్నితో వివాహేతర సంబంధం ఉంది. గురువారం రాత్రి మంగ వేరొకరితో ఫోన్ మాట్లాడుతుండటంతో అనుమానించిన సన్ని గొడవపడ్డాడు. తనతో పాటు ముండూరు రావాలని ఒత్తిడి చేశాడు. అనంతరం ఇద్దరూ ఒకే గదిలో నిద్రించారు. శుక్రవారం తెల్లవారుజామున మంగ అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని విజయకుమారి గుర్తించి, మృతురాలి సోదరి రత్నమ్మకు సమాచారమిచ్చింది. బంధువులతో వచ్చి చూడగా మంగ పీక నులిమి హత్యకు గురైనట్లు తేలింది. సోదరి ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ బి.శ్రీనివాసరావు, ఎస్సై రవికుమార్, క్లూస్ టీమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.


