● ఆలయాల్లో మూలవిరాట్ ఫొటోలు, వీడియోలపై నిషేధం
● అయినా జనసేన నేతల చిత్రీకరణ
ద్వారకాతిరుమల: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మండలంలోని ఐఎస్ జగన్నాథపురంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పూ జలు వివాదానికి దారితీశాయి. నారసింహుని మూ లవిరాట్ ఫొటోలు, వీడియోలు తీయడమే ఈ వివాదానికి కారణం. ఆలయాల్లో స్వయంభు విగ్రహాలను ఫొటోలు, వీడియోలు తీయకూడదని దేవదాయశాఖ కమిషనర్ ఇటీవల ఆదేశాలు ఇచ్చారు. చినవెంకన్న దేవస్థానం అధికారులు ప్రధాన ఆలయంతోపాటు ఉప, దత్తత ఆలయాల్లోనూ ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలవరం నియోజకవర్గానికి చెందిన పలువురు జనసేన నాయకులు నారసింహుని ఆలయంలో పూజలు చేసి ఫొటోలు, వీడియోలు దిగడంతో పాటు వాటిని చేశారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై అధికారులు ఎందుకు స్పందించలేదని భక్తులు ఆక్షేపిస్తున్నారు.
యూట్యూబర్లపై కేసులు.. మరి ఇప్పుడు?
గతంలో శ్రీవారి ఆలయంలో మూలవిరాట్ను ఫొటోలు తీసిన, డ్రోన్ కెమెరా ఎగురవేసిన యూ ట్యూబర్లపై దేవస్థానం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించారు. అదే నిబంధనలు ఇప్పుడు జనసేన నాయకులకు వర్తిస్తాయా? నిబంధనలు ఉల్లంఘించిన వారిపైనా చర్యలు తీసుకుంటారా? లేక అధికార పార్టీ నాయకులు కావడంతో కిమ్మనకుండా ఉంటారా? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.


