కుక్కునూరు: గ్రామంలోని ప్రజలకు రోడ్లు వేసి మంచి చేస్తున్నామన్న ముసుగులో కూటమి పార్టీకి చెందిన నాయకులు ప్రభుత్వ భూమిలో గ్రావెల్ను యథేచ్ఛగా తవ్వి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో ఎలాంటి రోడ్డు నిర్మాణ పనులకు గ్రాంట్లు లేదా అనుమతులను ప్రభుత్వం మంజూరు చేయకపోయినా.. రోడ్లు వేయడం బట్టి చూస్తే వెనక ఉన్న వ్యాపార కోణం అర్థం చేసుకోవచ్చు. మండల పరిధిలోని కివ్వాక పంచాయతీ, కమ్మరిగూడెం గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూమి లోని గ్రావెల్ గుట్టను ఐదు రోజులుగా పొక్లయిన్లతో తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. అదేమంటే రోడ్లు వేస్తున్నామని చెబుతున్నారు. అయితే రోడ్లు వేసే పేరుతో పగలూరాత్రి తేడా లేకుండా గ్రావెల్ను అమ్ముకుంటున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. విషయం పత్రికల్లో వస్తేనో లేదా ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళితే తప్ప స్పందించని పరిస్థితి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ఈ అక్రమ తోలకాలపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.
గ్రామాల్లో రోడ్ల నిర్మాణం పేరుతో దోపిడీ
కమ్మరిగూడెంలో గ్రావెల్ గుట్ట తవ్వకం
రాత్రివేళా తవ్వకాలు


