సాక్షి, టాస్క్ఫోర్స్: నా ఉసురు కచ్చితంగా చింతమనేనికి తగులుతుందని వైఎస్సార్సీపీ నేత భాను సతీమణి పాలడుగు శ్రావణి అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆనాడు నా ఇంటికి వచ్చి ’భాను నువ్వు నా తమ్ముడివి, నువ్వు ఎక్కడికీ వెళ్ళవద్దు, నాతోనే ఉండు’ అని బ్రతిమలాడావు. కానీ నీ వ్యవహారం నచ్చక మేం వైఎస్సార్సీపీలో చేరాం. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరితోనే ఉంటాం. అబ్బయ్య చౌదరి విజయానికి కృషి చేస్తాం. నా భర్తను కొట్టిస్తే మేం భయపడిపోతామా? ఎంతమందిని కొడతారు? ఈరోజు భానుని.. రేపు ఇంకొకరిని.. ఇలా ఎంతమంది మీద దాడి చేయిస్తావు?‘ అని ఆమె ప్రశ్నించారు. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తమ ప్రయాణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుందని స్పష్టం చేశారు. ‘నా భర్త మీకోసం కోట్లు ఖర్చు పెట్టాడు. మీరు చెప్పిన ప్రతిపని నా భర్త తన శక్తి మేరకు చేశాడు. మానవత్వంతోనే నా భర్త ఇన్నాళ్లు మీతో కలిసి పనిచేశాడు. మీరేం చేశారు? నా భర్తను కొట్టిస్తారా? ఎంతమందిని తీసుకొస్తారు? ఎంతమందితో కొట్టిస్తారు?‘ అని నిలదీశారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తాము భయపడేది లేదని, వెనక్కు తగ్గేది లేదని పాలడుగు శ్రావణి తేల్చిచెప్పారు.
వైఎస్సార్సీపీ నేత భాను సతీమణి
పాలడుగు శ్రావణి


