ఏలూరు (ఆర్ఆర్పేట): దేశంలో మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ చర్చిలు, పాస్టర్లు, క్రైస్తవ మత పెద్దలపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని, బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికే వర ప్రసాదరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా డిమాండ్ చేశారు. ఏలూరు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ టీమ్స్ ఆధ్వర్యంలో నగరంలోని బిషప్ శాంతి సాగర్ నివాసంలో రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో రిటైర్డ్ అధికారులు, అడ్వకేట్లు, సీనియర్ పాస్టర్లు పాల్గొని క్రైస్తవులు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలా మెలగాలో దిశానిర్దేశం చేశారు. చర్చా వేదికలో భాగంగా 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను సవరించి పేరా 3ని పూర్తిగా తొలగించాలని, అంతేకాకుండా ఆగస్టు 10న తలపెట్టిన ‘బ్లాక్ డే’ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.


