న్యూస్రీల్
సాయం అందడం లేదు
ఒక్క రూపాయి ఇవ్వలేదు
రూ.171 కోట్లకు ఎగనామం
శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, ఏలూరు: చెప్పేది కొండంత.. చేసేది గోరంతా ఇది కూటమి సర్కారు తీరు. అన్నదాత సుఖీభవ పేరుతో ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామని సూపర్సిక్స్తో కూడిన మేనిఫెస్టోలో ప్రకటించి ఇంటింటికీ ష్యూరిటీ బాండ్లో ఐదేళ్లలో కలిపి ఎంత వస్తుందో అంకెలతో సహా వివరించి పత్రాలు పంచారు. కట్చేస్తే.. అధికారంలోకి రాగానే మొదటి ఏడాది ఎగనామం.. రెండో ఏడాది నుంచి రూ.20 వేల నుంచి 14 వేలకు కుదించారు. అది కూడా ఎంపిక చేసిన కొందరికే పరిమితం. ఇది జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకం అమలవుతున్న తీరు.
నిలువునా వంచన : అన్నదాత సుఖీభవ పేరుతో అన్నదాతను సర్కారు నిలువునా మోసం చేసింది. రూ.20 వేలు ఏటా ఇస్తామని చెప్పి రూ.14 వేలతో సరిపెట్టింది. అది కూడా మూడు విడతల్లో ఇవ్వడం, అలాగే ఎంపిక చేసిన రైతులకు మాత్రమే వర్తింపజేయడం, కౌలురైతులను మాత్రం యథావిధిగా గాలికి వదిలేయడంతో అగచాట్లు పెరిగాయి. ఇప్పటికే ప్రకృతి విపత్తులతో అన్నదాత పూర్తిగా నష్టపోతూ ఆర్థిక కష్టాలను అధిగమించి అప్పులతో సాగు చేస్తే గిట్టుబాటు ధరలు లేక పూర్తిగా కుంగిపోతున్న పరిస్థితి. కనీసం పంట పెట్టుబడులకై నా ఉపయోగపడేలా అన్నదాత సుఖీభవ ఉంటుందని ఆశించిన రైతులు మరోమారు కూటమి సర్కారు మాటలు నమ్మి భంగపడ్డారు. జిల్లాలో శుక్రవారం అన్నదాత సుఖీభవ మూడో విడత నగదు పంపిణీ సభ ముసునూరు మండలం చెక్కపల్లిలో జరిగింది. జిల్లా వ్యాప్తంగా 1,60,968 మంది రైతులకు రూ.6 వేల చొప్పున రూ.89.85 కోట్లు పంపిణీ చేసి రైతులను పూర్తిస్థాయిలో ఆదుకున్న ప్రభుత్వమని, అన్నదాతలకు సర్కారు ఉగాది కానుక అంటూ ప్రకటించుకున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. జిల్లాలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతుభరోసా, సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీ ఇలా ప్రతి సందర్భంలోనూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులను ఆదుకున్నారు. ప్రధానంగా పంటల పెట్టుబడుల సమయంలో రైతుభరోసాతో ఆర్థిక ఇబ్బంది తగ్గించడంతో పాటు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాల కోసం క్యూలో నిలబడి లాఠీచార్జ్లకు గురికాకుండా ఆ యా గ్రామాల్లోనే అందించేలా రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి సమర్థవంతంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం గత సర్కారు ఏర్పాటు చేసిన వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి పాత రోజులను పునరావృతం చేస్తుంది.
విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చు కలిపి ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.80 వేలు ఖర్చవుతోంది. పంటలకు గిట్టుబాటు ధర లేక పెట్టుబడి కూడా వెనక్కి రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం అమలు కావడం లేదు. గతేడాది కేంద్రం ఇచ్చిన రూ.2 వేలు మినహా చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదు. అకాల వర్షాలు, చీడపీడల వల్ల నష్టపోయినప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి బీమా లేదా పరిహారం అందడం లేదు.
– మాగసాని గురుబ్రహ్మం, రైతు, బాలువారిగూడెం, చింతలపూడి మండలం
కౌలు రైతులకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. చాలా అన్యాయం. మూడేళ్లుగా నష్టపోతున్నాం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో న్యాయం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఆర్థికంగా నష్టపోయాం. రైతులకు ఎంతో మేలు చేస్తుంది అనుకున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రధానంగా కౌలు రైతులు విషయంలో చాలా ఇబ్బందులు గురిచేస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆంక్షలు ఏమీ లేకుండా కై లు రైతులకు న్యాయం చేశారు.
– కోమటి నాగేశ్వరరావు
బాదంపూడి, కౌలు రైతు, ఉంగుటూరు మండలం
దగాపడ్డ రైతన్న
అరకొరగా అన్నదాత సుఖీభవ
తొలి ఏడాది ఎగనామం
జిల్లాలో 1.60 లక్షల మంది రైతులు
గత ప్రభుత్వంలో రూ.1,830 కోట్లు అందజేత
కూటమి పాలనలో ధరల పతనం, నష్టపరిహారాలు అందక విలవిల
కౌలు రైతులకు మొండిచేయి
కూటమి ప్రభుత్వం సూపర్సిక్స్లో హామీ ఇచ్చిన విధంగా ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు అన్నదాత సుఖీభవ అందించాల్సి ఉంది. దీనిద్వారా ఏటా జిల్లాలోని 2,35,847 మంది రైతులకు ఏడాదికి రూ.471.69 కోట్లు జమ కావాల్సి ఉంది. అయితే సాయాన్ని రూ.14 వేలకే పరిమితం చేసి మూడు విడతలు కలిపి సుమారు రూ.300 కోట్లు పంపిణీ చేస్తూ రూ.171 కోట్లకుపైగా ఎగనామం పెట్టారు. అది కూడా సర్కారు కొలువుతీరిన మొదటి ఆర్థిక సంవత్సరం ఎగ్గొట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను శుక్రవారం మూడో విడత పంపిణీ చేశారు. జిల్లాలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2,35,847 మంది రైతులకు రూ.1,830.24 కోట్లు జమ చేస్తే కూటమి ప్రభుత్వం వివిధ ఆంక్షల పేరుతో అర్హుల జాబితాను భారీగా కుదించి 1,60,968 మందికే పరిమితం చేసింది. ఇక కౌలురైతులకు గుర్తింపుకార్డులు, పథకాలు ఇస్తామని ప్రకటించి కౌలురైతులకు గుర్తింపు కార్డులు, పంట నష్టపరిహారంతో సహా ఏ పథకం అమలుకాని పరిస్థితి.


