న్యూస్రీల్
నిరక్షరాస్యులే అధికంగా ఉన్నారు
ఆందోళనకు గురిచేయడం తగదు
గురువారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2026
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతం కేఆర్పురం ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న గిరిజన ఉపాధ్యాయులకు గుబులు మొదలైంది. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల పనితీరు, పాఠశాలల్లో సౌకర్యాలు వంటి నాలుగు అంశాలపై గత కొద్ది రోజులగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి. దీనితో ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు టెన్షన్ పడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఐవీఆర్ఎస్ కాల్స్కు ఎలా స్పందిస్తారోనని భయాందోళన చెందుతున్నారు. గిరిజన ప్రాంతంలో ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు అధిక శాతం మంది గిరిజనులు నిరక్ష్యరాసులే. వారి చేతులో సెల్ఫోన్లు ఉన్నా.. వాటిని పూర్తిగా వినియోగించడం తెలియదు. వారికి ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తే, రికార్డెడ్ వాయిస్ కాల్ ద్వారా మాట వినిపిస్తే.. వారు ఎలా సమాధానం చెప్పగలరని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. కచ్చితమైన సమాచారం ఇవ్వగలరా? అని వాపోతున్నారు. ఇలా ఫోన్లు వచ్చిన సందర్భంలో ఏమీ తెలియని తల్లిదండ్రులు ఇదేదో స్పామ్ కాల్ అని భావించి, భయపడుతూ వెంటనే కాల్ చేస్తున్నారని దీంతే సర్వేలో తక్కువ శాతం నమోదైతే ఉన్నతాధికారులు నుంచి ఎలాంటి చర్యలు ఉంటాయోనని ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్ విధానం తొలగించి అధికారులు పర్యవేక్షణ కార్యక్రమాలు పెడితే బాగుంటుందని ఉపాధ్యాయ సంఘ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే నలుగురికి పిలుపు
ఐవీఆర్ఎస్ కాల్స్ చేసిన సమయంలో తక్కుమంది విద్యార్థుల తల్లిదండ్రులు స్పందించిన నేపధ్యంలో బుట్టాయగూడెం ఐటీడీఏ యాజమాన్యంలో పని చేస్తున్న నలుగురు ఉపాధ్యాయులను ఉన్నతాధికారులు విజయవాడ పిలిపించి ఐవీఆర్ఎస్ కాల్స్ తక్కువగా నమోదు కావడానికి కారణాలు అడిగి ఇకపై 80 శాతం నమోదు అయ్యేటట్లు చూడాలని అధికారులు చెప్పినట్లు తెలిసింది.
విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు
ఉపాధ్యాయుల పనితీరుపై పాఠశాలల నిర్వాహణపై ప్రభుత్వం ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్న నేపథ్యంలో అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాలల్లో అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాల్స్ వచ్చిన సమయంలో ఎలా స్పందించాలి. అ కాల్స్లో వచ్చే ప్రశ్నలకు అవును, కాదు అనే దానికి ఎలా బటన్ నొక్కాలి అని అవగాహన కలిగిస్తున్నారు.
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు అధికంగా నిరక్షరాస్యులే ఉన్నారు. కూలి పనులకు వెళ్లేవారు ఎక్కువగా ఉన్నారు. ఫోన్లు వాడడం తెలియని వారు ఉన్నారు. వారికి ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తే వారికి తెలియక ఎదొకటి నొక్కితే ఉపాధ్యాయులకు ఇబ్బందే. దీని కంటే ఉన్నతాధికారులు పాఠశాలలు సందర్శిస్తే బాగుంటుంది.
– కందుల ప్రకాష్, వైఎస్సార్టీఎఫ్– పోలవరం నియోజకవర్గం అధ్యక్షుడు
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఐవీఆర్ఎస్ కాల్స్ రావడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఆ కాల్స్కు ఎలాంటి సమాధానం చెప్తారోనని భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఈ విధానాన్ని విరమించుకోవాలని కోరుతున్నాం.
– బొరగం రెడ్డిదొర, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
ఉపాధ్యాయుల పనితీరు, పాఠశాలల్లో సౌకర్యాలపై ఆరా
తల్లిదండ్రుల నుంచి సంతృప్తి స్థాయి లేకుంటే చర్యలు
ఇప్పటికే నాలుగు పాఠశాలల ఉపాధ్యాయులకు మెమోలు జారీ
విజయవాడ వెళ్లి సమాధానం చెప్పుకున్న ఉపాధ్యాయులు


