108 ఉద్యోగుల సమ్మె సైరన్
భీమవరం(ప్రకాశం చౌక్): కుయ్.. కుయ్.. అంటూ ఆపదలో ఉన్న వారి చెంతకు నిమిషాల్లో చేరి ప్రాణాలు రక్షించే 108 అంబులెన్స్ సేవలకు అంతరాయం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ సమస్యల పరిష్కారం కోసం 108 వాహన ఉద్యోగులు నెలలు తరబడి ఎదురుచూస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతనెల 25 వరకు ఎదురుచూసిన ఉద్యోగులు పోరాటబాట పట్టారు. ఆరోగ్యశ్రీ లేబర్ కమిషనర్కు గతనెల 26న సమ్మె నోటీసు ఇచ్చారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఈనెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని నోటీసులో పేర్కొన్నారు. అలాగే సమస్యలతో కూడిన 18 డిమాండ్లను పొందుపర్చారు. అయితే సమస్యల పరిష్కారానికి చ ర్చలు జరుగుతున్నా సఫలం కాలేదు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 108 వాహన సిబ్బంది మొత్తం 203 మంది పనిచేస్తున్నారు.
డిమాండ్లు
● ఉద్యోగులకు సీఎం చంద్రబాబు ప్రకటించిన రూ.4 వేలల్లో రూ.2 వేలు మాత్రమే పెంచి మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ ఆర్ ఎఫ్పీ ప్రకారం ఈపీఎఫ్ఓ యాజయాన్య వాటాను యాజమాన్యమే చెల్లించాలని చెప్పినా ఇప్పటికీ పట్టించుకోలేదు.
● గత సర్వీసు ప్రొవైడర్ ఇప్పటికీ పుల్, ఫైనల్ సెటిల్మెంట్ చేయకపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలి.
● పోలీస్ ఎఫ్ఐఆర్ ఉందని, ఫీల్డ్ విజిట్లో పలురకాల పనిష్మెంట్ల పేరుతో భవ్య సంస్థ ఉద్యోగుల విధులను నిలుపుదల చేయడం లేదా టెర్మినేషన్ చేయడం చేస్తోంది. ఇలా టెర్మినేట్ చేసిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి.
● ఉద్యోగులను తొలగించకుండా మెరుగైన ట్రైనింగ్ ఇవ్వాలి.
● భవ్య సంస్థ వచ్చి 7 నెలలు పూర్తయినా ఏ ఉద్యోగికి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వకపోవడం, జీతాలపై స్పష్టత లేకపోవడంపై తీవ్ర ఆందోళన నెలకొంది.
● 5 నుంచి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి వెంటనే ఆటోమెటిక్ శ్లాబ్ అప్గ్రేడ్ చేయాలి.
● భవ్య సంస్థ పనిష్మెంట్ కాలాన్ని చూపుతూ జీతాన్ని తగ్గించడం మానాలి. శ్లాబ్కు అనుగుణంగా వేతనాలు చెల్లించాలి.
● గత సర్వీస్ ప్రొవైడర్ రిలీవింగ్ బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదు. గతంలో మాదిరిగా షిఫ్ట్కు రూ.200 చెల్లించాలి.
● కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మాదిరిగా ఫెస్టివల్ హాలిడేస్ ప్రయోజనాలు అందించాలి.
● సిబ్బంది నియామకం చేపట్టాలి.
● వాహనాల మరమ్మతులకు జిల్లాకు ఒక గ్యారేజీ ఉండటంతో సేవలకు ఆటంకం కలుగుతోంది. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలి.
● వాహనం మైనర్ రిపేర్కు గురైతే ఆ ఖర్చులను సిబ్బంది భరించాలని అధికారులు చెబుతున్నారు. సంస్థ ఆ ఖర్చులు భరించేలా చర్యలు తీసుకోవాలి.
● రోజుకు 12 గంటల పని ఒత్తిడితో కూడకుందని, 8 గంటల పనివిధానం అమలు చేయాలి.
● వాహనాలు నిలుపు ప్రదేశంలో షెల్టర్ లేదని, వాహనాల క్లీనింగ్లకు, ఉద్యోగులకు వాష్రూంలు ఏర్పాటు చేయాలి.
● బ్రేక్ డౌన్ అయిన వాహన సిబ్బందికి అటెండెన్స్ ఇవ్వాలి.
● సంస్థ సీపీఆర్ ఫోన్లు ఇవ్వడం వల్ల మొబైల్ డేటా లేకపోవడంతో అవాంతరాలు ఏర్పడుతున్నా యి. ప్రతి వాహనానికీ డేటాతో కూడిన ఆండ్రాయిడ్ ఫోన్లు అందించాలి.
● ఐఎఫ్టీ కేసుల విషయంలో సరైన గైడెన్స్ రూపొందించి మెడికల్ ఆఫీసర్లకు, 108 సర్వీస్ ప్రొవైడర్కు తెలియజేయాలి.
ఉమ్మడి జిల్లాలో 108 ఉద్యోగులు జిల్లా మేనేజర్ 1 సూపర్వైజర్లు 2 పైలెట్లు 90 ఈఎంటీలు 110
కుయ్.. కుయ్.. కష్టాలేనోయ్!
సమస్యల పరిష్కారానికి నోటీసు
18 డిమాండ్ల సాధనే లక్ష్యం
ప్రభుత్వం స్పందించకుంటే 12 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి..
ఉమ్మడి జిల్లాలో నిలిచిపోనున్న సేవలు


