
చెక్ పవర్ రద్దుపై హైకోర్టు స్టే
పెనుగొండ: కుట్రతో రద్దు చేయించిన చెక్ పవర్ రద్దును నిలిపివేస్తూ హైకోర్టు స్టే విధించిందని పోడూరు మండలం పండిత విల్లూరు సర్పంచ్ ఇళ్ల లక్ష్మీ చంద్రిక తెలిపారు. శనివారం హైకోర్టు ఉత్తర్వులను కలెక్టరు చదలవాడ నాగరాణి, డీపీఓ రామ్నాథ్రెడ్డిలకు పోడూరు జెడ్పీటీసీ గుంటూరి పెద్దిరాజు, ఆచంట ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ గుబ్బల వీరబ్రహ్మం, వైఎస్సార్సీపీ నాయకుడు గెద్దాడ ఏకలవ్యలతో కలిసి అందించినట్లు తెలిపారు. ఈ పోరాటానికి సహకరించిన మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఇతరులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏలూరు (టూటౌన్) : తన పొలం చుట్టూ సిమ్మెంట్ దిమ్మలతో ఫెన్సింగ్ వేస్తే ఇటీవల కొన్ని దిమ్మెలు అపహరణకు గురయ్యాయని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని దెందులూరు మండలం శ్రీరామవరం గ్రామానికి చెందిన కామిరెడ్డి వీర వెంకట సత్య సతీష్ శనివారం కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. శ్రీరామవరంలో తన పొలం అన్యాక్రాంతం కాకూడదని పొలం చుట్టూ సిమెంట్ దిమ్మెలతో ఫెన్సింగ్ వేసినట్లు తెలిపారు. ఆ సిమెంట్ దిమ్మెలు వేరే వ్యక్తి పొలంలో దర్శనమిచ్చాయని దీనిపై దెందులూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినందుకు కొందరు తనను బెదిరించి కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏలూరు (టూటౌన్): బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో ఫైబర్ టీవీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా టెలికం ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ఎల్.శ్రీను తెలిపారు. స్థానిక టెలికం జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫైబర్ టీవీ కేవలం రూ.400లకే అందిస్తున్నామని, రూ.260 ఇంటర్నెట్, రూ.140కి కాల్స్ ప్లస్ తో 400 ఛానల్స్, 9 ఓటీటీ చానల్స్ ఇస్తారన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఒక్క రూపాయికే 4జీ సిమ్ ఉచితంగా ఇవ్వడంతో పాటు 30 రోజుల కాలవ్యవధితో కొత్త ఫ్రీడం ప్లాన్ను ప్రవేశ పెట్టినట్లు చెప్పారు.
ముదినేపల్లి రూరల్: పురుగులమందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ శనివారం ఉదయం మృతి చెందింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం కలిదిండి మండలం కోరుకొల్లుకు చెందిన సిరివెళ్ల సుబ్బారావు కుమార్తె కామాక్షిని(31) చల్లపల్లి మండలం మంగలాపురం గ్రామానికి చెందిన పేరం శ్రీనుకు ఇచ్చి 12 ఏళ్ల క్రితం వివాహం చేశారు. శ్రీను మద్యానికి బానిసై తరచూ భార్యను వేధించేవాడు. దీంతో కామాక్షి పుట్టింటికి వచ్చింది. 20 రోజుల కిందట శ్రీను కోరుకొల్లు వచ్చి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న ఇద్దరు పిల్లల్ని తనవెంట తీసుకువెళ్లాడు. దీంతో మనస్తాపం చెందిన కామాక్షి ముదినేపల్లిలోని కనకదుర్గమ్మ ఆలయం వద్దకు వచ్చి పురుగులుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. చికిత్స నిమిత్తం గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా మెరుగైన వైద్య నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
పోలవరం రూరల్: శ్రీసత్య సాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, వర్కర్స్ వేతన బకాయిలు తక్షణమే ఇవ్వాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మొడియం నాగమణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పట్టిసం వద్ద వర్కర్స్ బకాయిల కోసం చేపట్టిన నిరసన కార్యక్రమానికి సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 11 నెలల వేతనాలు బకాయిలు ఉంటే కార్మికులు కుటుంబాలు ఎలా గడుస్తాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. ఎస్సై షేక్ జబీర్ తెలిపిన వివరాల ప్రకారం.. టి.నరసాపురం మండలం అప్పలరాజుగూడానికి చెందిన తొమ్మిదేళ్ల వెంకటాచలం, అతని భార్య కృష్ణకుమారి (50) బైక్పై జంగారెడ్డిగూడెం వస్తున్నారు. తాడువాయి సమీపంలో వెనుక నుంచి లారీ బైక్ను ఢీకొంది. వెనుక కూర్చొన కృష్ణకుమారి జారి పడిపోయింది. ఆమె లారీ టైర్ల కింద పడిపోగా, ఆమెను కొంత దూరం లారీ ఈడ్చుకుపోయింది. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. వెంకటాచలానికి స్వల్ప గాయాలయ్యాయి.

చెక్ పవర్ రద్దుపై హైకోర్టు స్టే