
30న శ్రీవారి క్షేత్రంలో ఉగాది వేడుకలు
ద్వారకాతిరుమల: నూతన సంవత్సరాది పర్వదినానికి శ్రీవారి క్షేత్రం ముస్తాబవుతోంది. ఈ ఏడాది ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా సోమవారం స్థానిక ఉగాది మండపానికి రంగులు వేసే పనులను ప్రారంభించారు. అలాగే మండప పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తున్నారు. ఈనెల 30న విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ఉభయ దేవేరులతో శ్రీవారు ఆలయం నుంచి వెండి శేష వాహనంపై ఊరేగింపుగా మండపం వద్దకు వెళ్తారు. అక్కడ మండపంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం అర్చకులు, పండితులు పంచాంగ శ్రవణము జరుపుతారు. ఆ తరువాత పండిత సత్కారం, తీర్థప్రసాద వినియోగం జరుగుతుందని, భక్తులు ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆలయ ఈఓ సత్యన్నారాయణ మూర్తి కోరారు.
పసల కృష్ణభారతి
యువతకు ఆదర్శనీయం
తాడేపల్లిగూడెం అర్బన్ : గాంధేయవాది, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు పసల కృష్ణ భారతి నేటి యువతరానికి ఆదర్శనీయమని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. కృష్ణభారతి మృతిపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మిల రెండో కుమార్తె కృష్ణభారతి తల్లిదండ్రుల అడుగుజాడల్లో పయనించి స్వాతంత్య్ర సమరయోధురాలిగా నిలిచారని అన్నారు. ఆమె వృద్ధాశ్రమాలను స్థాపించి నిరాశ్రయులైన వృద్ధులకు తోడుగా నిలిచి సేవా తత్పరత కలిగిన మహిళగా ప్రసిద్ధి పొందారని మాజీ మంత్రి కొట్టు తెలిపారు. ఆమె కుటుంబం తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వారు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. కృష్ణభారతి కుటుంబంతో తమకు బంధుత్వం ఉందని గుర్తు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కృష్ణభారతి పోషించిన కీలక పాత్రను తెలుసుకుని ప్రధానమంత్రి నరేంద్రమోడి స్వయంగా ఆమె పాదాలకు నమస్కరించడం ఆమె ఔన్నత్యానికి నిదర్శనమన్నారు. కృష్ణభారతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

30న శ్రీవారి క్షేత్రంలో ఉగాది వేడుకలు