జూదం కేసులో 281 మందికి నోటీసులు
ఆగిరిపల్లి: మండలంలోని పోతవరప్పాడు మ్యాంగో బే కల్చర్ అసోసియేషన్లో ఆదివారం పోలీసులు దాడిలో పట్టుబడిన 281 మందిని డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఐదు బస్సులలో తరలించి నూజివీడు కోర్టులో హాజరు పర్చారు. స్వాధీనం చేసుకున్న రూ.32 లక్షలను కోర్టుకు అప్పగించారు. జడ్జి ఆదేశాల మేరకు వారికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఏలూరు (మెట్రో): గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమం, ఇతర సమస్యలపై అధికారులతో కలెక్టరు కె.వెట్రిసెల్వి మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ జిల్లా పర్యటనలో లేవనెత్తిన అంశాల విషయంలో నూరుశాతం లక్ష్యాలు సాధించాలన్నారు. మోదెల గ్రామ ప్రజల కోరిక ప్రకారం బుట్టాయిగూడెం మండలంలోకి మోదెల గ్రామాన్ని కలిపేందుకు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. రెడ్డిగూడెం, రాజానగరం, కోటరామచంద్రపురంలో సెల్ ఫోన్లు సిగ్నల్స్ లేవని ఫిర్యాదులు వస్తున్నాయని, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సెల్ టవర్స్ రిపేర్లు ఉంటే చేయించి, కొత్తగా అవసరమైన చోట టవర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి కార్యక్రమాలకు భూసేకరణలో భూమికి భూమి ఇవ్వాలని, అర్హత ఉన్నవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జాబు మేళా ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని అన్నారు. హెల్త్ సబ్ సెంటర్లకు 108 వాహనం వెళ్ళేలా రహదారుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్, పాల్గొన్నారు.
ఏలూరు (మెట్రో): ఎరువులు పంపిణీ, ఎరువులు, విత్తనాల నాణ్యతపై వ్యవసాయాధికారులతో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మంగళవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయాధికారులు వారి పరిధిలో కావలసిన ఎరువులు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, ప్రస్తుత వ్యవసాయ సీజన్లో జిల్లాలోని రైతులకు ఎరువుల కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. రానున్న 10 రోజులకు అవసరమైన ఎరువులు నిల్వ ఉండేలా చూసుకోవాలన్నారు. ఎక్కడైనా ఎరువుల కొరత ఎదురైతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. ఎరువులు, విత్తనాల నాణ్యతను వ్యవసాయ, అనుబంధ రంగాల శాఖల సిబ్బంది పరిశీలించాలని, కల్తీ విత్తనాలు, ఎరువులు ఎక్కడా పంపిణీ కాకుండా ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ఆయిల్ పామ్, కోకో వంటి ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని లక్ష్యం కన్నా ఎక్కువగా పెంచామన్నారు. జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా, ఉద్యానవన శాఖాధికారి షాజా నాయక్, మైక్రో ఇరిగేషన్ అధికారి రామ్మోహన్, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు, మండల వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు సంయుక్తంగా ఐక్య క్రిస్మన్ వేడుకలు జరుపుకున్నారు. సోమవారం రాత్రి ఏఆర్ పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో ఐజీ జీవీజీ అశోక్కుమార్, ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ పాల్గొన్నారు. క్యాండిల్స్ వెలిగించి క్రీస్తును ఆరాధించారు. ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ... ఏసుక్రీస్తులా ప్రేమ, శాంతి బోధనలు అవలంబిస్తూ తోటి వారికి సహాయం చేయాలన్నారు. ఎస్పీ కొమ్మి శివకిషోర్ మాట్లాడుతూ.. క్రీస్తు జీవించిన విధానం కరుణ, దయ, త్యాగం, ఎదుటి వ్యక్తుల పట్ల ప్రేమ చూపించే అంశాలను ప్రతి ఒక్కరికీ ఆచరణీయం అన్నారు.
జూదం కేసులో 281 మందికి నోటీసులు


