బుట్టాయగూడెం: ఇటీవల గుళ్లపూడికి చెందిన మడకం యాకోబు అనే గిరిజనుడిపై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవా లని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న యాకోబును పరా మర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నామన్నారు. అలాగే అతడి వైద్యానికి ఆర్థిక సహా యం కూడా చేసినట్టు చెప్పారు. యాకోబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, తప్పు చేసినట్టు రుజువైతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి గాని చిత్ర హింసలు పెట్టడం సరికాదన్నారు. ఫారెస్ట్ అధికారుల దాడిలో యాకోబు పక్కటెముకలు విరిగాయన్నారు. ఈ సంఘటనకు బాధ్యులైన సబ్ డీఎఫ్ఓ, ఇతర అధికారులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డి మాండ్ చేశారు. విషయాన్ని డీఎస్పీ దృష్టికి కూ డా తాను తీసుకువెళ్లానని, బాధితుడికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని బాలరాజు తెలిపారు. వైస్ ఎంపీపీ గగ్గులోతు మోహన్రావు, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ నేత సోదెం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
పెద్ద వాగు మరమ్మతులకు కృషి
వేలేరుపాడు: తెలంగాణలోని పెద్దవాగు ప్రాజెక్ట్ మరమ్మతుల విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి 15 రోజుల్లో ఓ కొలిక్కి తెస్తామని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. సోమవారం అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లిలో పెద్దవాగు ప్రాజెక్టును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల ఆయకట్టు రైతులతో ఆయన మాట్లాడారు. ప్రాజెక్ట్ వ్యవహారంపై తక్షణమే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎస్లకు నోటిసులు జారీ చేసి ఢిల్లీకి రప్పిస్తానన్నారు. ఏలూరు జిల్లా కలెక్టర్లతోపాటు ఇరిగేషన్ ఎస్ఈలను అక్కడికే పిలిచి ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేసి పెదవాగు ప్రాజెక్టు సమస్యను పరిష్కరించేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చా రు. అనంతరం గండ్లు పడిన పెద్దవాగు ప్రా జెక్టు ప్రధాన ఆనకట్టను పరిశీలించి ఆయకట్టు రైతులతో మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తెలుగును ఐచ్ఛికం చేయొద్దు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్మీడియెట్ విద్యలో సంస్కరణల్లో భాగంగా ద్వితీయ భాష తెలుగును ఐచ్ఛిక సబ్జెక్టుగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ తెలుగు అధ్యాపకుల సంఘం నాయకులు ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె. యోహానుకు వినతిపత్రం సమర్పించారు. సోమవారం స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ప్రారంభమైన ఇంటర్ మూల్యాంకనం సందర్భంగా వినతిపత్రాన్ని సమర్పించారు. తెలుగును ఐచ్ఛికం చేయడం వల్ల భాష మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీబీ రాజేష్ కుమార్, టి.ప్రేమ్కుమార్, కృష్ణంరాజు, కనకదుర్గ తదితరులు ఉన్నారు.
అపరాల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ఏలూరు(మెట్రో): ఏపీ మార్క్ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మద్దతు ధరతో మినుములు, పెసలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్టు జేసీ పి.ధాత్రిరెడ్డి సోమవారం ప్రకటనలో తెలిపారు. పెదపాడు, వట్లూరు, డీసీఎంఎస్ ఏలూరు, జాలిపూడి, దెందులూరు సొసైటీల్లో పెసలు కొనుగోలు కేంద్రాలు, లింగాల, దేవపూడి, తామరకొల్లు, డీసీఎంఎస్ ఏలూరు, దెందులూరు, డీసీఎంఎస్ అప్పన్నవీడు, పెదపాడు, వెంకటాపురం సొసైటీల్లో మినుము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు.
గిరిజనుడిపై దాడి దారుణం
గిరిజనుడిపై దాడి దారుణం


