● భాగవతంలోని
నరకాసురుని పాత్రతో గుర్తింపు
● ప్రముఖ సినీ నటుడు అజయ్ఘోష్
చాగల్లు: గణపతి నవరాత్ర మహోత్సవాల సందర్భంగా చాగల్లు తెలగా సంఘం వినాయకుడి గుడి వద్ద ఆ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సినీ నటుడు అజయ్ ఘోష్ సందడి చేశారు. స్వామివారి దర్శనం అనంతరం ఆయనను తెలగా సంఘం సభ్యులు, నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికి సత్కరించారు. రంగస్థలం’, ‘పుష్ప’, ‘మంగళవారం’ తదితర చిత్రాల్లో తన నటనతో మెప్పించిన అజయ్ ఘోష్ చాగల్లులోని వినాయకుని దర్శనానంతరం మెగా డైరెక్టర్ వివి వినాయక్ స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. భాగవతం టీవీ సీరియల్లో పోషించిన నరకాసురుని పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టిందని, దీంతో సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చాయని ఘోష్ పేర్కొన్నారు. తనది ప్రకాశం జిల్లా అని, చీరాల సిటీ కేబుల్లో న్యూస్ రీడర్గా పనిచేస్తూ, సినిమాలపై మోజుతో హైదరాబాద్ వెళ్లానన్నారు. దారి తప్పి వచ్చానని తెలుసుకోవడానికి మూడు నెలలు పట్టిందని, బతుకుతెరువు కోసం విజయవాడ సిటీ కేబుల్లో పని చేస్తూనే టీవీ సీరియళ్లలో పలు పాత్రలు చేశానని తెలిపారు. ఆ క్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ రామ్మా చిలకమ్మ చిత్రంలో అవకాశం ఇచ్చినట్టు ఘోష్ తెలిపారు. అనంతరం దేవ కట్టా దర్శకత్వంలో వచ్చిన ప్రస్థానం, పూరి జగన్నాథ్ సినిమా జ్యోతిలక్ష్మి చిత్రాల్లో పాత్రలు పేరు తెచ్చాయన్నారు. తమిళ విచారణ సినిమాలో పాత్రల్లో నటన చూసి దర్శకుడు సుకుమార్ రంగస్థలం, పుష్ప చిత్రాల్లో పాత్రలు ఇచ్చారని, వాటిని చూసి దర్శకుడు వివి వినాయక్ ప్రత్యేకంగా అభినందించారని తెలిపారు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో బాలకృష్ణ హీరోగా చేస్తున్న దాదా చిత్రంలో నటిస్తున్నట్టు ఆయన తెలిపారు.


