సీటీఆర్ఐ: బేడ (బుడ్గ) జంగం క్రమసంఖ్య–9 కింద ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను ఆన్లైన్లో మంజూరు చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్క్లబ్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం ఆ కులం వారికి ఎస్సీ జాబితాలో క్రమసంఖ్య–9లో ఉందన్నారు. 1950 నుంచి ఆ కులానికి ఎస్సీ గుర్తింపు ఉందని, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లోనూ ఇది అమల్లో ఉందని పేర్కొన్నారు. సంచార జాతుల జనగణన నిర్వహించి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గతంలో హామీలు ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. 2024 లో సీఎం చంద్రబాబు ఆదేశించినా తమను ఎస్సీలుగా గుర్తించడం లేదని, ఇటీవల కలెక్టర్ల సదస్సులో 24 గంటల్లో కుల ధ్రువీకరణ పత్రాల సమస్యను పరిష్కరిస్తామని ఆయన ఇచ్చిన హామీ మేరకు తమ కులానికి క్రమసంఖ్య–9 ఎస్సీ సర్టిఫికెట్లను ఆన్లైన్లో మంజూరు చేయాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సోషల్ వెల్ఫేర్ శాఖ ఉన్నతాధికారులు సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్ల వెంకట నాయుడు, ఓబీసీ మోర్చా సంక్షేమ సంఘం నాయకుడు నరేష్ యాదవ్, బేడ (బుడ్గ) జిల్లా అధ్యక్షుడు తురపాటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


