ఎండ దెబ్బకు రత్నగిరి భక్తుల వెతలు
అన్నవరం: అసలే వేసవిని తలపిస్తున్న ఎండలు.. ఆపై సిమెంటు ఫ్లోరింగ్పై నడక.. సత్యదేవుని దర్శించుకునేందుకు శుక్రవారం రత్నగిరికి విచ్చేసిన భక్తులకు నరకప్రాయంగా మారింది. దేవస్థానానికి విచ్చేసే భక్తులకు ఎండ నుంచి ఉపశమనం లభించక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రతి రోజూ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం వరకు 30 డిగ్రీల పైబడి ఎండలు కాస్తుండడంతో స్వామివారి సన్నిధికి విచ్చేసే భక్తులు అల్లాడిపోతున్నారు. స్వామివారి దర్శనం అయ్యాక అన్నదానం హాలు వద్దకు వెళ్లేందుకు, పశ్చిమ రాజగోపురం ఎదురుగా గల విశ్రాంతి షెడ్డు వద్దకు వెళ్లేందుకు సిమెంట్ రోడ్డుపై నడుస్తుంటే కాళ్లు కాలి ఇబ్బంది పడుతున్నారు. పశ్చిమ రాజగోపురం వద్ద గల చెట్టు వద్ద సేదతీరుతున్నారు. ఆలయ అధికారులు కనీసం షామియానాలు కూడా వేయించకపోవడం, సిమెంటు రోడ్డుపై నడిచేందుకు వీలుగా కార్పెట్ ఏర్పాటు చేయకపోవడం, రోడ్డును నీటితో తడపకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా భక్తుల ఇబ్బందులను గుర్తించి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


