సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పారదర్శకంగా, సకాలంలో కొనుగోలు చేసేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో 2026–27 ఖరీఫ్ ధాన్యం కొనుగోలు, సేకరణకు సంబంధించిన డీపీసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణకు చేసిన ఏర్పాట్లు, కొనుగోలు కేంద్రాలు, గోనె సంచుల లభ్యత, ధాన్యం రవాణా, మిల్లులకు తరలింపు తదితర అంశాలను సమీక్షించారు.
కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర అందేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఏపీఎస్సీఎస్సీఎల్ నేరుగా ఆర్ఎస్కేల ద్వారా రైతు పొలం వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయనుందన్నారు. ఎల్నినో ప్రభావంతో ఈ సీజన్లో దిగుబడుల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున, వాస్తవంగా వచ్చే దిగుబడులు, మార్కెట్కు వచ్చే ధాన్యం పరిమాణాన్ని నిరంతరం అంచనా వేస్తూ రైతులకు పూర్తి ప్రయోజనం కలిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం జిల్లాలో 96,266 హెక్టార్లలో వరి సాగు జరుగుతుండగా, వరి కోతలు అక్టోబర్ మూడో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. దానికి అనుగుణంగా కొనుగోలు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని 254 రైతు సేవా కేంద్రాల్లో పీపీసీలు ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ తెలిపారు.


