రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్రంలో ఫోరెన్సిక్ సేవలను బలోపేతం చేసేందుకు రాజమహేంద్రవరంలో రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నిర్మించినట్టు డీజీపీ హరీష్కుమార్ గుప్తా అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలో నిర్మించిన ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన వివిధ విభాగాలను సందర్శించి పనులను ఆరా తీశారు. అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ 2025 సంవత్సరంలో రాష్ట్రంలో 1,87,721 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, వీటిలో ఏడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడే నేరాలకు సంబంధించిన 16,847 కేసులు ఉన్నాయని తెలిపారు. సాక్ష్యాల సేకరణ కోసం ఎఫ్ఎస్ఎల్/క్రైమ్ స్పాట్ టీమ్స్ సుమారు 4,200 నేర స్థలాలను సందర్శించాయని, మొత్తం 25,602 కేసులను ఏపీఎఫ్ఎస్ఎల్, ఆర్ఎఫ్ఎస్ఎల్లకు ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారని తెలిపారు. ప్రస్తుతం గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలో 6 ల్యాబ్లు పనిచేస్తున్నాయని తెలిపారు. 2025లో ల్యాబొరేటరీ 25,602 కేసుల్లో 23,682 పరిశీలించి, 1,920 పెండింగ్లో ఉంచిందన్నారు. దీంతో 92.5 శాతం డిస్పోజల్ రేటు సాధించి దేశ వ్యాప్తంగా రెండో స్థానాన్ని సాధించిందన్నారు. హత్య, పోక్సో/మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల టర్న్ అరౌండ్ సమయాన్ని దాదాపు 50 శాతం తగ్గించి, 15 రోజుల నుంచి 7 రోజులకు తీసుకువచ్చామన్నారు. ఎన్డీపీఎస్ కేసులను గతంలో 30 రోజులు పట్టే సమయంలోగా కాకుండా 14 రోజుల్లో పూర్తి చేస్తున్నామన్నారు. ఆధునిక ఫోరెన్సిక్ సాంకేతికతలు, విశ్లేషణాత్మక పరికరాల వినియోగంతో డీఎన్ఏ డిటెక్షన్ రేటు 85 శాతం నుంచి 97 శాతానికి, రక్త గ్రూప్ డిటెక్షన్ రేటు 52 శాతం నుంచి 85.77 శాతానికి పెరిగిందన్నారు. కొత్త క్రిమినల్ చట్టాలు, 2023 అమలులో భాగంగా ఏపీఎఫ్ఎస్ఎల్ 24+7, మూడంచెల ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా శాసీ్త్రయ దర్యాప్తు అవసరాలను ఈ ల్యాబ్ తీర్చనుందన్నారు. ఈ ఏడాదికి సుమారు 2,300 కేసులను స్వీకరించే అవకాశం ఉందన్నారు. ఏపీఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ పీహెచ్డీ రామకృష్ణ, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్, ఎస్పీ డి.నరసింహకిశోర్, పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ, కృష్ణా జిల్లా ఎస్పీలు అద్నాన్ నయీమ్ అస్మి, శివ కిశోర్, విద్యాసాగర్ నాయుడు, నగరపాలకసంస్థ కమిషనర్ రాహుల్ మీనా, ఆర్ఎఫ్ఎస్ఎల్ జేడీ ఈశ్వరమ్మ, జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా


