ఊబర్ బైక్ డ్రైవర్కు గాయాలు
పంజగుట్ట: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ యువతి మృతి చెందగా, ఊబర్ టూవీలర్ డ్రైవర్ గాయాలతో బయటడ్డాడు. పంజగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం వెంకటరాయపురానికి చెందిన వజ్జిపర్తి హేమ దుర్గ (26) అమీర్పేటలో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లోని ఓ కార్ల షోరూంలో కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తోంది. శనివారం మధ్యాహ్నం సెల్ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు అమీర్పేట హాస్టల్ నుంచి ఊబర్ బైక్ బుక్ చేసుకుంది. అమీర్పేట బిగ్బజార్ వెనకవైపు శ్రీనగర్ కాలనీ రోడ్డులో వీరు వెళ్తున్న వాహనాన్ని కూకట్పల్లి డిపో బస్సు ఢీకొట్టింది. వెనక కూర్చున్న హేమ దుర్గ కిందపడడంతో ఆమె తలపై నుంచి బస్సు చక్రాలు వెళ్లాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఊబర్ బైక్ డ్రైవర్ ఒరిస్సాకు చెందిన హిమాంచల్ పాత్రో గాయాలపాలయ్యాడు. అతన్ని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు హేమ దుర్గ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ షేక్ అన్వర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై దాడులు
అమలాపురం రూరల్: ముమ్మిడివరం మండలం అన్నంపల్లి టోల్ ప్లాజా వద్ద రవాణాశాఖ అధికారులు శనివారం ప్రైవేట్ బస్సులను తనిఖీలు చేశారు. 21 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసి నిబంధనలు పాటించని 12 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.40,800 అపరాధ రుసుం విధించినట్టు జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎంవీఐలు సురేష్ కుమార్, వరప్రసాద్ పాల్గొన్నారు.


