● అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంలో నిర్లక్ష్యం
● ఉమ్మడి జిల్లాలో ఇంకా వెనుకబాటే
● నేడు ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం
రాజమహేంద్రవరం: అభివృద్ధితో పాటు అక్షరాస్యతలోనూ జిల్లా వెనకబడుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమాల అమలులో లోపాలు.. పల్లెల్లో అవగాహనా రాహిత్యంతో అక్షర సుమాలను వెదజల్లలేకపోతోంది. ‘ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు’ అంటారు కానీ మహిళలే వెనుకబడిపోతున్నారు. నేటికీ జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రజల్లో పలువురు వేలిముద్రలు వేసే స్థాయిలోనే ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మంగళవారం ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
జిల్లా వంద శాతం అక్షరాస్యత సాధించడంలో పూర్తిగా తడబడుతోంది. 2011 లెక్కల ప్రకారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనాభా 51.54 లక్షలు ఉండగా, వారిలో 25.69 లక్షల మంది పురుషులు, 25.84 లక్షల మంది మహిళలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. పురుషుల అక్షరాస్యత 74.51 శాతం, మహిళల అక్షరాస్యతా 67.52 శాతంగా ఉంది. ప్రస్తుత జనాభా 54.50 లక్షలు ఉండవచ్చనేది అంచనా. గతంతో పోలిస్తే అక్షరాస్యతలో కొంత పెరుగుదల కనిపిస్తున్నా, జిల్లాలో వంద శాతం సాధించడంలో వెనుకబడిపోతున్నాం. ప్రధానంగా పేదరికం, వలసలే కారణం. ప్రజల వెనుకబాటు తనానికి చాలా సందర్భాల్లో నిరక్షరాస్యతే కారణమవుతోంది. సంపూర్ణ అక్షరాస్యత కోసం జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతున్నా, చర్యలు నేటికీ తడబడుతూనే ఉన్నాయి.
ప్రస్తుతం.. అత్యంత అవశ్యం
తరం.. మనిషి ఆలోచనా విధానం మారింది. సమాజం సాంకేతికంగా దూసుకుపోతోంది. మనిషి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు అడుగు ముందుకు వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఉన్న ప్రతి చిన్నారి తల్లిదండ్రుల ఆలోచనా విధానం మారింది. గతంలో దీనికి భిన్నంగా ఉండేది. ఇప్పుడు తమ పిల్లలను ఉన్నతంగా చదివించేందుకు తల్లిదండ్రులు ప్రాధాన్యం ఇస్తున్నారు. మంచి పాఠశాలలను ఎంపిక చేసుకుని మరీ పంపిస్తున్నారు. అయితే కొంతమందికి చదువు రాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా వెనుకడుగు మాత్రం వేయడం లేదు. ముఖ్యంగా విద్యాభివృద్ధికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మనబడి నాడు–నేడు పథకం ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసింది. ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలగరాదనే ఉద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టి, చిన్నారులను బడికి పంపించిన తల్లిదండ్రుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు ఇచ్చే పథకాన్ని అమలు చేసింది. వయోజనులు సైతం కొద్దిపాటి అక్షర జ్ఞానంతో కొన్నింటిని అందిపుచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో చదువుకున్న ప్రతి ఒక్కరూ తమ గ్రామంలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాల్సిన అవసరం ఉంది. మనకెందుకులే అనే ధోరణిని వదిలి సామాజిక బాధ్యతగా గుర్తించాలి. ఉపాధి క్షేత్ర సహాయకులు, డ్వాక్రా సంఘాలు, అంగన్వాడీ కార్యకర్తలు, యువత, సేవా సంస్థలు దీనిపై దృష్టి సారించి, సంపూర్ణ అక్షరాస్యత దేశంగా మార్చేందుకు కృషి చేయాలి.
ఉల్లాస్ పేరుతో ముందుకు..
గతంలో వయోజనులైన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసేందుకు సాక్షరతా మిషన్ ద్వారా చర్యలు చేపట్టారు. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) పేరుతో నవ భారత సాక్షరత కార్యక్రమాన్ని 2024లో ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా ఉన్న నిరక్షరాస్యులను గుర్తించి 2029లోగా వీరిని అక్షరాస్యులుగా చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా 2024–25 ఆర్థిక సంవత్సరం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ, డ్వామా, పట్టణ ప్రాంతాల్లో మెప్మా సంస్థల ద్వారా నిరక్ష్యరాస్యులను గుర్తించి వారిని అక్షరాస్యులుగా చేసే కార్యక్రమం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించారు.
ఉల్లాస్ ప్రోగ్రామ్ రెండేళ్లలో జిల్లాల వారీగా నిరక్షరాస్యులు, వారిలో అక్షరాస్యులుగా మారిన వారు, ఇంకా మిగిలిన వారు..
జిల్లా నిరక్షరాస్యులు అక్షరాస్యులు మిగిలిన వారు
కాకినాడ 3,52,025 1,09,081 2,42,944
కోనసీమ 1,34,176 59,625 74,551
తూర్పుగోదావరి 2,56,000 88647 1,67,353
పోలవరం 86,811 38,392 48419


