● దీర్ఘకాలిక నొప్పుల నుంచి ఉపశమనం
● నేడు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం
రాయవరం: వైద్య రంగంలో నేడు ఫిజియోథెరపీ కీలకంగా మారింది. దీనిద్వారా అనేక నొప్పులు, వ్యాధులకు ఉపశమనం కలిగిస్తున్నారు. గుండె సర్జరీ, కీళ్ల మార్పిడి సర్జరీ, సిజేరియన్ వంటివి చేసిన తర్వాత మజిల్స్ సాధారణ స్థితికి రావడానికి ఇది దోహదపడుతుంది. ఇప్పుడు ప్రతి ఆస్పత్రిలో ఫిజియోథెరపిస్టు ఉంటున్నారంటే వారి ప్రాధాన్యం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేడు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ కథనం.
ఫిజియోథెరపీ ద్వారా దీర్ఘకాలిక సమస్యలైన స్పాండిలైటిస్, ప్రోజెన్ షోల్డర్, టెన్నిస్ ఎల్బో తదితర ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఫోన్లు, కంప్యూటర్ల వాడకంతో భుజాలు, మెడ, నడుము నొప్పులతో బాధపడుతున్నారు. గంటల తరబడి కూర్చుని ఉద్యోగం చేసే సందర్భంలో వారి శరీరాకృతిలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి వారికి మందుల వాడకం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ బాధ లేకుండా ఫిజియోథెరపీ ఎంతో ఉపయోగకరం. గర్భిణులు తెలిసీ తెలియకుండా వాడే మందులతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. వారికి జన్మించే చిన్నారులు జన్యులోపంతో బాధపడుతున్నారు. గర్భం దాల్చిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వ్యాయామం చేయాలనే దానిపై ఫిజియోథెరపిస్ట్లను సంప్రదించడం ఉత్తమం.
ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇదీ
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ప్రతి మండలంలో భవిత కేంద్రం ఉంది. ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు భవిత కేంద్రం ద్వారా అవసరమైన ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నారు. ప్రతి మూడు మండలాలకు ఒక ఫిజియోథెరపిస్టు చొప్పున జిల్లాలో 21 మంది ఫిజియోథెరపిస్టులు సేవలందిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో దాదాపు 10 వేల మంది ఫిజియోథెరపిస్ట్లు ఉన్నారు. ఇటీవల కాలంలో ఫిజియోథెరపీకి ప్రాధాన్యం పెరగడంతో ఈ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ కూడా పెరుగుతున్నాయి.


