అన్నవరం: సత్యదేవుని ఆలయానికి శనివారం భక్తుల తాకిడి భారీగా పెరిగింది. సుమారు 50 వేల మంది స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారని అధికారులు తెలిపారు. స్వామివారి వ్రతాలు నాలుగు వేలు జరిగాయని చెప్పారు. స్వామివారి దర్శనానికి రెండు గంటలు, రూ.200 టిక్కెట్తో ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టిందని వివరించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షలు ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. సత్యదేవుని అన్న ప్రసాదాన్ని ఆరు వేల మంది భక్తులు స్వీకరించారని చెప్పారు. వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు, వ్రత మండపాలు కిక్కిరిసిపోయాయి.
వాడపల్లి వాసా.. శ్రీ వేంకటేశా!
స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
ఆత్రేయపురం : కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి శనివారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల గోవింద నామ స్మరణలతో మాడవీధులు మార్మోగాయి. భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి ఏడేడు జన్మల పుణ్యఫలంగా భావించారు. స్వామివారిని 80 వేల మందికి పైగా భక్తులు శనివారం దర్శించారని ఆలయ ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. భక్తులు వేద ఆశీర్వచనం, విశిష్ట దర్శనం, ఉచిత దర్శనం ద్వారా స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారుజాము నుంచి భక్తులు వివిధ రాష్ట్రాలు, సుదూర ప్రాంతాల నుంచి వాడపల్లికి విచ్చేసి గౌతమీ గోదావరి నదిలో స్నానాలు ఆచరించారు. క్యూలైన్లో నిలబడి స్వామిని దర్శించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కాలినడకన సైతం స్వామి వారి దర్శనానికి విచ్చేశారు. ఆలయంలో వేకువ జామునే సుప్రభాత సేవ, తొలి హారతి, నీరాజనం, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాల భోగం వంటి కార్యక్రమాలను ఆలయ అర్చకులు, వేద పండితులు ఆగమ శాస్త్రానుసారం నిర్వహించారు.


