రాజమహేంద్రవరం రూరల్: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేసేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి, రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా చెల్లుబోయిన వేణును పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు శుక్రవారం బొమ్మూరులోని పార్టీ కార్యాలయానికి చేరుకుని ఆయన్ని పుష్ఫగుచ్చాలు, శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కేఆర్జే రాజేష్ మిత్ర బృందం హుకుంపేట డీబ్లాకు తదితర ప్రాంతాల నుంచి భారీ బైక్ ర్యాలీగా వచ్చి వేణును సన్మానించారు. కొంతమూరు నుంచి వైఎస్సార్ సీపీ మెనార్టీ సెల్ అధికార ప్రతినిధి ఎంఎం అలీ, నియోజకవర్గ పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షుడు చెరుకూరి సత్యనారాయణలతో కలసి వచ్చి వేణును సత్కరించారు. పార్టీ మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ హమీద్ బాషా, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ నిజాముద్దీన్, ధవళేశ్వరం గ్రామానికి చెందిన పార్టీ నేత మెండా రాజేష్ మిత్ర బృందం, దామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దళిత నేతలు వచ్చి వేణుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిందన్నారు. ప్రభుత్వం మోసాలను ప్రజలకు వివరించాలన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు
చెల్లుబోయిన వేణు పిలుపు


